Chakka Jam: ఢిల్లీలో ‘చక్కా జామ్’ టెన్షన్.. వేలాది మంది పోలీసులతో భారీ భద్రత..

Farmers protest - Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 70రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. చక్కా జామ్..

Chakka Jam: ఢిల్లీలో ‘చక్కా జామ్’ టెన్షన్.. వేలాది మంది పోలీసులతో భారీ భద్రత..

Updated on: Feb 06, 2021 | 11:33 AM

Farmers protest – Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 70రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా చక్కా జామ్ (రోడ్ల దిగ్భంధనం) చేపట్టనున్నాయి. ఈ ఆందోళనకు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 50 వేల మంది పోలీసు, కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్‌ ర్యాలీలో చెలరేగిన హింసను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ సరిహద్దుల్లో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

సింఘు, ఘాజీపూర్, టిక్రీ బోర్డర్లల్లో పెద్ద ఎత్తున బారికేడ్లను, సిమెంట్ దిమ్మెలను, ముళ్లకంచెలు, మేకులు ఏర్పాటు చేసి వాటర్ కెనాన్లను సిద్ధంచేశారు. ఢిల్లీ నగరంలోని 12 మెట్రో రైల్వేస్టేషన్లపై పోలీసులు నిఘా ఉంచడంతోపాటు ఎర్రకోట వద్ద భారీ ఎత్తున సిబ్బందిని మోహరించారు. మరలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోంది. దీంతో దేశ రాజధానిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా.. యూపీ,ఉత్తరాఖండ్‌, ఢిల్లీలో చక్కాజామ్‌ ఉండదని రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దులతోపాటు దేశంలోని పలుచోట్ల శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. చక్కా జామ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి, ఆహార సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైతులకు సూచించారు.

Also Read:

సచిన్‌ పోస్టుపై కొనసాగుతున్న దుమారం, రైతు సమస్యలపై 10 రాష్ట్రాల ప్రతినిధులతో సుప్రీం కమిటీ సంప్రదింపులు

Follow Us