దేవిరమ్మ టెంపుల్.. ఇలాంటి గుడి మీరు జన్మలో చూసి ఉండరు.. మీకోసం డ్రోన్ విజువల్స్..

ఆకాశం మార్గంలో అమ్మోరి గుడి.. మీరు చూస్తున్నారు...మహాద్బుతాన్ని. ఇది ఎవరెస్ట్‌ కాదు .. కానీ ఆకాశాన్ని తాకే ఈ శిఖరం ఎవరెస్ట్‌కు ఏమాత్రం తక్కువ కాదు. కంటి దగ్గర..కాలుకు దూరం .. చూడ్డానికి వారెవా అన్పించే సహజ అందాలు..ఈ సోయగాలను చూశాక..ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్పించక మానదు. వెళ్లొచ్చు. కానీ ఎప్పుడంటే అప్పుడు అది సాధ్యం కాదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆ ఛాన్స్‌ వుంటుంది. అందాల గులాబీలా ఈ దృశ్యం వెనుక కూడా ప్రమాదల ముల్లు వుంటుంది. ఆ శిఖరాన్ని తాకాలంటే వాలుగా వుండే ఘాట్‌ రోడ్‌లో నిటారుగా వెళ్లాలి. ఏమాత్రం పట్టు తప్పినా.. ప్రమాదమే. కానీ అక్కడ అణువణువూ మహాద్భుతం. నిను చూడని కనులెందుకు అన్పించేలా మనసును కట్టిపడేస్తాయి ప్రకృతి అందాలు. ఇది పశ్చిమ కనుమల్లో ప్రకృతి గీసిన కమనీయ..రమణీయ దృశ్యం .

దేవిరమ్మ టెంపుల్.. ఇలాంటి గుడి మీరు జన్మలో చూసి ఉండరు..  మీకోసం డ్రోన్ విజువల్స్..
Deviramma Temple

Updated on: Dec 21, 2025 | 9:45 PM

కర్నాటక చిక్‌మగుళూరులో దేవిరమ్మ గుడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.  ఆకాశాన్ని తాకేలా ఎత్తయిన కొండపై ఆలయం భక్తుల్ని ఆకర్షిస్తోంది. దాదాపు 3వేల అడుగులో ఎత్తు..  కొండ అంచున అమ్మోరి సన్నిధి తన్మయత్వానికి గురి చేస్తోంది. సర్ప ఆకారంలో ఆలయ ప్రాంగణం ఉంటుంది.  గుడికి చేరాలంటే 15 కి.మీ నడిచి వెళ్లాలి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఏడాది పొడువునా ట్రెక్కింగ్‌ కోసం సాహసయాత్రలు చేస్తూనే ఉంటారు.

వారెవా..క్యా సీన్‌ హై! . ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టుగా ఎత్తయిన కొండలు.. ఒళ్లంత థ్రిల్లంతా అయ్యేలా పలకరించే మబ్బులు..ఎటుచూడూ కనువిందు చేసే పచ్చదనం. అల్లంత ఎత్తున కొండ.. కొండ అంచున రెపరెలాడే జెండా….సొగసు చూడతరమా..! అన్పించే ఈ సహజ అందాల నిధి.

ఇది కర్నాటక చిక్‌మగళూరు జిల్లా బిండిగా గ్రామంలోని దేవిరమ్మ గుడి. ఆకాశాన్ని టచ్‌ చేసేలా ఉన్న కొండపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువై వున్నారు. జాతర టైమ్‌లో మాత్రమే ఆ అమ్మ దర్శనం వుంటుంది.మిగతా రోజుల్లో కొండ దిగువన ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి

మూడు వేల అడుగుల ఎత్తులో వున్న దేవిరమ్మ గుడికి చేరాలంటే 15 కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. అది వాలుగా వుండే ఘాట్‌ రోడ్‌లో. ఏమాత్రం పట్టు తప్పినా సరే లోయలోకి జారి లైఫ్‌ గల్లంతే. కానీ అలాంటి ఘటనలకు తావులేకుండా ఇలా పకడ్బందీగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు.

ప్రతి యేటా నరకచతుర్దశి రోజు భక్తులు చీమలదండుల్లా ఈ కొండకు పోటెత్తుతారు. ప్రమాదాలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతారు. ఘాట్‌ రోడ్‌..లోయలు..ఎత్తయిన కొండలు.. ఎటుచూడూ ఆహ్లాదకరమైన వాతావరణం మనసును కట్టిపడేస్తుంది.కొండపైకే వెళ్లే మార్గంతో పాటు కొండ అంచున దుర్గమ్మ ఆలయ ప్రాంగణం సర్ప ఆకారంలో కన్పించడం మరో విశేషం

నరకాసురుణ్ణి వధించిన తరువాత దుర్గమ్మ .. ఈ ఎత్తయిన కొండపైన కొలువయ్యారని.. పచ్చని ప్రకృతికి పరవశించి శాంతించారనేది పురాణ కథనం. గుండె నిండా భక్తితో తరలివచ్చే భక్తులు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ అంటే మక్కువ చూపే సాహసవంతుల రద్దీతో కొండంత సందడి కన్పిస్తూనే ఉంటుంది దేశవిదేశాల నుంచి ఎంతో మంది సాహసవంతులు ట్రెక్కింగ్‌ కోసం ఇక్కడకు వస్తుంటారు. ఎవరెస్టో.. ఊటి కొడైకెనాలో కాదు ప్రకృతి ఒడిలో పరవశించాలనే తపన వుంటే ..ఇంకెందుకు ఆలస్యం చలో చిక్‌మగుళూరు.