Bulldozer: రక్తానికి బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రిపై చర్యలు.. రంగంలోకి బుల్డోజర్..

|

Oct 26, 2022 | 12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో నిర్లక్ష్యంగా రోగికి రక్తానికి బదులు బత్తాయి జూస్‌ ఎక్కించి మరణానికి కారణమైన హాస్పిటల్‌పై ప్రయోగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు.

Bulldozer: రక్తానికి బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రిపై చర్యలు.. రంగంలోకి బుల్డోజర్..
Prayagraj Hospital
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో నిర్లక్ష్యంగా రోగికి రక్తానికి బదులు బత్తాయి జూస్‌ ఎక్కించి మరణానికి కారణమైన హాస్పిటల్‌పై ప్రయోగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రైవేటు ఆసుపత్రిని బోల్డోజర్‌తో కూల్చేసేందుకు రంగం సిద్ధమైంది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా.. అనధికారికంగా ఆసుపత్రిని నిర్మించారని విచారణలో తెలింది. దీంతో శుక్రవారం వరకూ ఖాళీ చేయాలని ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు.. ఆసుపత్రికి కూల్చివేత నోటీసు జారీ చేశారు. గ్లోబల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌కు ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు ఇచ్చిన కూల్చివేత నోటీసులో.. ఈ హాస్సిటల్‌ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారని, ఖాళీ చేయాలంటూ కొన్ని నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని తెలిపింది. నోటీసులకు యాజమాన్యం స్పందించకపోవడంతో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశామని ప్రయాగరాజ్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

35 ఏళ్ల డెంగ్యూ రోగి మృతి చెందిన తరువాత ప్రాథమిక దర్యాప్తులో..ఆ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా బత్తాయి జూస్‌ ఎక్కించారని, అందుకు ఆ ఆసుపత్రి అధికారుల అలసత్వం కారణమని వెల్లడైంది. దీంతో గత వారం ఈ ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రోగులు ఎవరే లేరని తెలిపారు.

మృతుని బంధువుల కథనం ప్రకారం… ‘ప్లాస్మా’ అనే లేబుల్ ఉన్న బ్యాగ్‌లో బత్తాయి రసాన్ని తీసుకొచ్చి, ఎక్కించారన్నారు. ఆరసాన్ని రోగికి ఎక్కించిన తర్వాత, ఆరోగ్యం మరింత క్షీణించిందని,తరువాత ఆయనను వేరొక ఆసుపత్రికి తరలించామన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని బంధువులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ బ్యాగులో ఉన్నది బత్తాయి రసమా? కాదా? అనే విషయాన్ని వెల్లడించే మెడికల్ రిపోర్టును ఇప్పటి వరకూ బయటపెట్టడం లేదు. ఇదిలా ఉంటే డెంగ్యూ రోగి మరణించిన మర్నాడే ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నకిలీ ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేసే ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..