Medical Oxygen – Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరతతో గత రెండు రోజుల నుంచి 50 మంది వరకు రోగులు మరణించారు. ఈ క్రమంలో ఆక్సిజన్ కోసం ఆసుపత్రుల్లో గందరగోళం నెలకొంది. అయితే.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపును గానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అడ్డుకున్న వారిని ఉరితీస్తాం అంటూ ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శనివారం విచారించింది.
ఈ పిటిషన్ జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం విచారించి.. ఈ మేరకు కఠిన వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్నైనా తమ దృష్టికి తీసుకురావాలనీ.. అలా అడ్డుకున్న వారిని ఉరి తీస్తాం అంటూ కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాంటి వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే.. ఈ నెల 21న ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని కేంద్రం చెప్పింది. అది ఎప్పుడు వస్తుందో చెప్పాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
కాగా.. ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో శనివారం ఉదయం.. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20మందికిపైగా రోగులు మరణించారు. నిన్న గంగారామ్ ఆసుపత్రిలో కూడా 22 మంది వరకూ మరణించారు.
Also Read: