Covid-19 Danger Bells: మళ్ళీ కరోనా విజృంభణ.. 2 రాష్ట్రాల్లోనే 75% శాతం కేసులు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం?

|

Feb 23, 2021 | 8:36 PM

దేశంలో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా సోకిన వారు కోలుకుంటుండడం, వైరస్ విస్తరణ తగ్గడం, వ్యాక్సిన్ పంపిణీ వేగవంతమవడంతో ఇక కరోనా మహమ్మారి భయం…

Covid-19 Danger Bells: మళ్ళీ కరోనా విజృంభణ.. 2 రాష్ట్రాల్లోనే 75% శాతం కేసులు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం?
Follow us on

Coronavirus danger bells again in the country: దేశంలో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా సోకిన వారు కోలుకుంటుండడం, వైరస్ విస్తరణ తగ్గడం, వ్యాక్సిన్ పంపిణీ వేగవంతమవడంతో ఇక కరోనా మహమ్మారి భయం తొలగిపోయిందని భావిస్తున్న వారు ఉలిక్కి పడే అంశాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చినా.. కీలక రాష్ట్రాలలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా రోజుల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పీఎంఓలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ హాజరయ్యారు. తాజా పరిస్థితిపై ప్రధానికి నివేదిక సమర్పించారు.

దేశంలో కరోనా వైరస్ విస్తరణపై‌ తాజా పరిస్థితిని మోదీకి అధికారులు వివరించారు. కొత్త రకం కరోనా వ్యాప్తిపై  చర్చించారు. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రైవేటు సంస్థల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేస్తే మరింత వేగంగా దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందుతుందన్న సూచనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో 50 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న విషయం ప్రస్తుతం ఆందోళన రేపుతోంది. దేశంలో మొత్తం నమోదైన రోజువారీ కేసుల్లో దాదాపు 75 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. జనవరిలో తగ్గుముఖం పట్టిన కరోనా ఫిబ్రవరి తొలి వారం నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తోంది. దాంతో రోజూ వారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో ఈ రెండు రాష్ట్రాల్లో యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేల మార్కును దాటింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు అలర్టయ్యాయి.

కాగా ఇప్పటి వరకు (ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 1 గంట వరకు) దేశ వ్యాప్తంగా కోటి 17 లక్షల 54 వేల 788 డోసుల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తొలి డోసు కోటి 4 లక్షల 93 వేల 205 మందికి ఇవ్వగా..  12 లక్షల 61 వేల 583 మందికి రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.  12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 శాతానికిపైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ చేరింది. తొమ్మిది రాష్ట్రాల్లో 60 శాతం ఫ్రంట్ లైన్ ఫైటర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ పంపిణీని ప్రైవేటు సంస్థల ద్వారా చేస్తే మరింత వేగంగా వ్యాక్సిన్ ప్రజలకు చేరుతుందన్న సూచనలు ప్రస్తుతం కేంద్రం ముందుకు వస్తున్నాయి. ఈ విషయంపై మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కరోనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మోదీ సమాలోచనలు జరిపి, కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నర కంటే తక్కువగా వుంది. కానీ కేరళలో 55 వేలు, మహారాష్ట్రలో 54 వేలు వుండడం ఆందోళన కలిగించే విషయం. కేరళలో అక్కడి ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా నియంత్రిస్తోందంటూ తొలి రోజుల్లో కథనాలు వచ్చినా.. ఆ కథనాల్లోని డొల్లతనం ఇపుడు బహిర్గతమవుతోంది. మరోవైపు జనసాంద్రత అధికంగా వుంటే ముంబై మహానగరంలో ఇటీవల లోకల్ రైళ్ళను ప్రారంభించడం కరోనా కేసుల పెరుగుదలకు కారణమైందని తెలుస్తోంది.

కరోనా మళ్ళీ విజృంభిస్తున్న కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌లలో పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలను పంపించాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించిన అంశాన్ని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు మోదీ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలతో సమిష్టిగా పని చేసి కరోనానను నియంత్రించాలని, వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలని మోదీ సూచించినట్లు సమాచారం.

దేశంలో కరోనా ప్రభావం మొదలై పదకొండు నెలలు కావస్తోంది. సెప్టెంబర్, 2020లో దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత నవంబర్ నుంచి దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో మెల్లిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాణిజ్య సముదాయాలు ప్రారంభమయ్యాయి. రవాణా వ్యవస్థ సాధారణ స్థాయికి చేరుకుంటోంది. సినిమా థియేటర్లు ఓపెనయ్యాయి. కొన్ని షరతులకు లోబడి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ పంపిణీ జనవరి 16న ప్రారంభం కావడంతో ప్రజల్లో కరోనాపై భయాందోళన కనిష్ట స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రజల్లో మరోసారి టెన్షన్ పెంచుతున్నాయి.

కరోనా ప్రభావం పూర్తిగా తొలగి పోయే దాకా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా మాస్కులను ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లను వాడడం వంటి పక్కన పెట్టొద్దని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరోసారి కరోనా ప్రబలడం ఖాయమని వారంటున్నారు. దానికి తోడు కరోనా వైరస్ కొన్ని వేల పరిణామాలను దాటిందని తాజాగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సీసీఎంబీ పరిశోధన ప్రకారం కరోనా వైరస్ కొన్ని వేల రూపాంతరాలకు గురైందని.. ఏ వెరైటీ ఎంత తీవ్రంగా మానవ శరీరంపై ప్రభావం చూపుతుందన్నది అంఛనా వేయడం ఇప్పటికిప్పుడు కష్టమని తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తత ఒక్కటే సరైన మార్గమని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి.

ALSO READ: ‘ఆ’ అంశాలపై జర జాగ్రత్త..! పార్టీ వర్గాలకు చంద్రబాబు హెచ్చరిక.. టీడీపీ శిబిరం అప్రమత్తం

ALSO READ: జోష్ మీద వైసీపీ.. సత్తా చాటుతామంటున్న టీడీపీ.. బెజవాడ బల్దియా బరిలో సై అంటే సై..!!

ALSO READ: బరిలో ఉద్దండులతో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక జోరుగా ప్రచార పర్వం

ALSO READ: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

ALSO READ: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే