సర్వీస్‌ గన్‌తో మామ, మరదలిను కాల్చి చంపిన కానిస్టేబుల్‌.. ఎక్కడో తెలుసా?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సర్విస్‌ తుపాకీతో ఇద్దరు బంధువులను కాల్చిచంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

సర్వీస్‌ గన్‌తో మామ, మరదలిను కాల్చి చంపిన కానిస్టేబుల్‌.. ఎక్కడో తెలుసా?
Chhattisgarh Gun Fire

Updated on: Sep 10, 2025 | 8:48 PM

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సర్వీస్‌ గన్‌తో ఇద్దరు బంధువలను కాల్చి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింద్‌పూర్‌ గ్రామానికి చెందిన శేష్‌రామ్‌ బింజ్వార్‌ అనే వ్యక్తి సీఏఎఫ్‌ 13 బెటాలియన్‌లో మద్వరని ఏరియాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం జిల్లాలో సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ పర్యటన నేపథ్యంలో శేష్‌రామ్‌కు ఉన్నతాధికారులు బందోబస్తు డ్యూటీ వేశారు.

అయితే శేష్‌రామ్‌కు తన చిన్నమామతో గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదునుగా చూసుకున్న శేష్‌రామ్‌ బందోబస్తుకు వెళ్లకుండా నేరుగా తన సర్వీస్‌ గన్‌ పట్టుకొని తన చిన్నమామ వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ వాళ్లతో గొడవ పడి తన దగ్గర ఉన్న సర్వీస్‌ గన్‌తో అతనిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అతను స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

తుపాకి శబ్ధం విని వెంటనే అక్కడికి చేరుకున్న  17 ఏళ్ల తన మరదలు మందస బింజ్వార్‌ను కూడా శేష్‌రామ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. కాల్పుల శబ్ధాలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.