
జువైనల్ హోమ్లో ఖైదీలుగా ఉన్న నలుగురు యువకులు వాచ్మెన్ను గొంతు కోసం అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకున్న ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తఖత్పూర్ పరిధిలోని అరైబంద్ గ్రామానికి చెందిన నరేంద్ర కుమార్ ఖాండే అనే వ్యక్తి సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోమ్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే అదే జువైనల్ హోమ్ ఖైదీలుగా ఉన్న నలుగురు యువకులు.. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేశారు. తొలుత వాచ్మెన్పై దాడి చేసి అతని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. ఆపై గేటు తాళాలు ఇవ్వాలని కోరారు. అయితే అందుకు అతను నిరాకరించడంతో గొంతు కోసి అతన్ని హత్య చేసి.. ఆ తర్వాత తాళాలు తీసుకొని పారిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వయసు పెరిగినా అదే కేంద్రంలో..
నిందితులు మైనర్లుగా ఉన్నప్పుడు నేరాలకు పాల్పడటంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద వారిని ఈ జైలుకు తరలించారు. అయితే వయసు పెరిగి పెద్దవారైనప్పటికీ, చట్టం ప్రకారం 21 ఏళ్లు నిండని కారణంగా వారిని ప్లేస్ ఆఫ్ సేఫ్టీలోనే ఉంచినట్లు అధికారులు వివరించారు. తప్పించుకున్న వారిలో రాయ్గఢ్ జిల్లాకు చెందిన ఇద్దరి యువకుల వయసు 18 పైగా, ఒకరి వయసు 19 పైగా ఉండగా.. కోర్బా జిల్లాలకు చెందిన మరో 20 ఏళ్ల యువకుడు ఉన్నాడు. వీరందరూ పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నట్టు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) సుజాత హల్దార్ తెలిపారు.
అయితే ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.