AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్: రూ.10 కోట్ల జరిమానా.. 3 నెలల్లోనే శిక్ష!

పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ - 2024'ను మరింత పటిష్టం చేసింది. పేపర్ లీక్ మాఫియాపై రూ. 10 కోట్లకు పైగా జరిమానాలు, 7 ఏళ్ల వరకు జైలు శిక్షలతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) ఏర్పాటు ద్వారా 2 నెలల్లో విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లో తీర్పులు వెలువరించేలా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్: రూ.10 కోట్ల జరిమానా.. 3 నెలల్లోనే శిక్ష!
Paper Leak Act
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2026 | 3:20 PM

Share

దేశంలో పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. 1986 నాటి జాతీయ విద్యా విధానం పేపర్ లీకేజీలపై చట్టం తేవాలని సూచించినప్పటికీ, 2024లో మోదీ ప్రభుత్వం తొలిసారిగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ – 2024’ ను అమల్లోకి తెచ్చింది. తాజాగా ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తీవ్రమైన శిక్షలు, త్వరితగతిన న్యాయం జరిగేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

భారీ శిక్షలు.. కోట్లలో జరిమానాలు!

పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు పాల్పడేవారికి కోలుకోలేని దెబ్బ తగిలేలా శిక్షల పరిమాణాన్ని భారీగా పెంచారు. పేపర్ లీకేజీల్లో భాగస్వాములైన వారికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే రూ.5 కోట్ల జరిమానా విధించడమే కాకుండా, ఆ సంస్థను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.  పరీక్షా ఏజెన్సీల యాజమాన్యం లేదా నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు తప్పు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 కోట్ల జరిమానా తప్పవు. ముఠాలుగా ఏర్పడి ఆర్గనైజ్డ్ పాల్పడే పేపర్ లీక్ మాఫియాకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల భారీ ఫైన్ పడుతుంది.

స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) – 2 నెలల్లోనే విచారణ పూర్తి!

పరీక్షల్లో జరిగే మోసాలు, పేపర్ లీకేజీలపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు చట్టబద్ధంగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (STF) ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ కేసు నమోదైన నాటి నుంచి కేవలం 2 నెలల్లోనే విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కాలయాపన లేకుండా నిందితులపై నిర్దిష్ట ఆధారాలతో వేగంగా ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చు.

ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు – 3 నెలల్లో తీర్పు!

కేసులు ఏళ్ల తరబడి మూలనపడకుండా ఉండేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయా రాష్ట్రాల హైకోర్టుల సంప్రదింపులతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ‘స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు’ ఏర్పాటు చేయాలి. ఈ కోర్టులు కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించి, కేవలం 3 నెలల వ్యవధిలోనే ట్రయల్ పూర్తి చేసి తీర్పు వెల్లడించాలి.

పెండింగ్ కేసులన్నీ బదిలీ.. ప్రత్యేక ప్రాసిక్యూటర్లు!

పాత కేసులపై దృష్టి: ప్రస్తుతం వివిధ దర్యాప్తు సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న విచారణలన్నింటినీ తక్షణమే స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేస్తారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు తరలించి, 3 నెలల గడువులోగా పరిష్కరిస్తారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు: ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో బాధితుల తరఫున, ప్రభుత్వం తరఫున వాదనలను బలంగా వినిపించేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల’ను నియమించేలా చట్టపరమైన వెసులుబాటు కల్పించారు.

వేగవంతమైన దర్యాప్తు, తక్షణ శిక్షలు, భారీ జరిమానాలు విధించేలా చేసిన ఈ నూతన మార్గదర్శకాలు నేరస్థులలో వణుకు పుట్టించడంతో పాటు, భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు పారదర్శకంగా జరగడానికి బలమైన కవచంగా నిలవనున్నాయి.

Follow Us