NEET-UG Paper Leak Case: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ దూకుడు.. తొలిసారి ఇద్దరు అరెస్ట్!

|

Jun 27, 2024 | 4:22 PM

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ తొలిసారిగా అరెస్టులకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా గురువారం ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లోని పాట్నలో వీరిని అరెస్ట్‌ చేశారు. నిందితులను మనీష్‌ కుమార్, అశుతోష్‌ కుమార్‌లుగా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. అశుతోష్‌ పేపర్‌లీకేజీకి సారధ్యం వహించగా..

NEET-UG Paper Leak Case: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ దూకుడు.. తొలిసారి ఇద్దరు అరెస్ట్!
NEET-UG Paper Leak Case
Follow us on

పాట్న, జూన్‌ 27: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ తొలిసారిగా అరెస్టులకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా గురువారం ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లోని పాట్నలో వీరిని అరెస్ట్‌ చేశారు. నిందితులను మనీష్‌ కుమార్, అశుతోష్‌ కుమార్‌లుగా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. అశుతోష్‌ పేపర్‌లీకేజీకి సారధ్యం వహించగా.. లీకైన క్వశ్చన్‌ పేపర్లను అమ్ముకునేందుకు మనీష్‌ గిరాకీలను పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రులు లీకైన ప్రశ్నపత్రాల కోసం లక్షల రూపాయల సొమ్మును దారపోసినట్లు సమాచారం.

నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు సంస్థ సోమవారం (జూన్‌ 24 ఐదు కేసులు నమోదు చేసింది. మరోవైపు విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ మరో కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఆరు కేసుల్లో బీహార్, గుజరాత్ ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా నమోదు చేశాయి. ఇక రాజస్థాన్ ప్రభుత్వం మూడు కేసులు నమోదు చేసింది. బీహార్ మినహా, మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో పేపర్లు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న అభ్యర్ధులు, ఇన్విజిలేటర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అందిన సమాచారం మేరకు బీహార్‌లో వ్యవస్థీకృత స్థాయిలో నీట్ పరీక్ష పేపర్ లీక్‌ జరిగినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో చీటింగ్‌ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా మే 5న సుమారు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరైన నీట్-యుజి 2024 పరీక్షకు సంబంధించి బీహార్, గుజరాత్‌లోని గోద్రాలో పేపర్ లీక్‌ల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా పరీక్షల సమగ్రతపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 4న విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకు రావడం అనుమానాలకు ఊతమిచ్చినట్లైంది. దీంతో దేశ వ్యాప్తంగా విద్యార్ధులు నిరసనలు చేపట్టారు. నీట్‌ మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్రం క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించి, సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను నియమించింది. గతవారం పాట్నా పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.