
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన వారసుడి పేరును ప్రకటించారు. బీఎస్పీ పగ్గాలు తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్కు అప్పగించారు. మాయావతి ఆధ్వర్యంలో లక్నోలో బీఎస్పీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పగ్గాలను ఆకాశ్ ఆనంద్కు అప్పగిస్తునట్టు మాయావతి ప్రకటించారు. సుమారు రెండు దశాబ్దాలుగా మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమోగా ఉన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించే కార్యక్రమాల్లో 28 ఏళ్ల ఆకాష్ చాలా కీలకంగా ఉంటున్నారు. అలాగే రాష్ట్రాల పర్యటన సమయంలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వీటికి తోడు ఇప్పటికే నేషనల్ కోర్డినేటర్ పదవి ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను మాయావతి పూర్తిగా ఆకాష్ ఆనంద్ కే అప్పగించారు. ప్రస్తుతం ఆకాష్ BSP జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్.. 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సహరాన్పూర్లో జరిగిన ర్యాలీలో మాయావతి ఆకాష్ను పార్టీ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. అనంతరమే పార్టీలో కీలక పదవి ఇచ్చారు. నేషనల్ కోర్డినేటర్ పదవితో జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారు. అప్పటి నుంచి మాయావతి తర్వాత పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు.
ఈ సంవత్సరం ఆగస్టు నుంచి లక్నోలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ఆకాష్ ఆనంద్ హాజరు కావడం.. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలో అతని స్థాయిని పెంచడానికి మరొక ఉదాహరణగా రాజకీయ నేతలు భావించారు. అనుకున్నట్లుగానే 2024 ఎన్నికలకు ముందు మాయావతి ఆకాష్ ను వారసుడిగా ప్రకటించడం.. అటు యూపీ, ఇటు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే, వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే మాయావతి ఇప్పుడు తన మేనలుడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం సంచలనం రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..