త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన బీజేపీ నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలకు ఈ బాధ్యతల్లో నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, సహ ఇన్ఛార్జిగా కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ను నియమించింది. అలాగే, అసోం ఇన్ఛార్జిగా కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, సహ ఇన్ఛార్జిగా జితేంద్రసింగ్, కేరళకు ఇన్ఛార్జిగా ప్రహ్లాద్ జోషి, సహ ఇన్ఛార్జిగా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, పుదుచ్చేరికి కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, సహ ఇన్ఛార్జిగా ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ను నియమిస్తూ జాతీయ పార్టీ కార్యాలయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా విస్తరణపై ఫోకస్ చేసిన బీజేపీ.. ఈ దిశగా పావులు కదుపుతోంది. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా… బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నాలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో పర్యటిస్తూ.. అయా రాష్ట్రాల ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. పార్టీ క్యాడర్ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ ఇన్చార్జిలను నియమించి మరింత చేరువయ్యేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి… తెలుగు రాష్ట్రాల జల వివాదం.. ఈనెల 5వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ