ఉత్తరభారతంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. బీహార్ చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. బీహార్ రాష్ట్రంలో వరదలు వెల్లువెత్తాయి. చాలా జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థమయ్యింది. భారీవర్షాలతో గంగానది నీటి మట్టం ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. గంగానది వరదనీరు పాట్నాతోపాటు పలు గ్రామాలను ముంచెత్తడంతో 35వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించారు.
సోనామా పంచాయితీ, ఖాస్పూర్, జెతులి, పునాది పంచాయితీలు వరదనీటిలో మునిగాయి. గంగా నది వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పాట్నాలోని తూర్పుభాగంలోని దిదర్ గంజ్ ప్రాంతం ముంపునకు గురైంది. పలు గ్రామాల వరద బాధితులు పడవలపై వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. వరదనీరు గ్రామాన్ని ముంచెత్తడంతో తమకు నిత్యావసర సరుకులు కూడా దొరకడం లేదని, పశువులు, పెంపుడు జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయని ఖాస్పూర్ గ్రామ నివాసి సరోజ్ కుమార్ చెప్పారు.
వరదల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచినీరు కూడా దొరక్క వరదబాధితులు అవస్థలు పడుతున్నారు. తూర్పు, పశ్చిమ చంపారన్, సుపాల్, అరారియా, మాధేపురా, షియోహర్, సహర్సా, కిషన్గంజ్, కటిహార్, పుర్నియా, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, సరన్ లతో పాటు 28 జిల్లాలు వరదల వల్ల దెబ్బతిన్నాయని బీహార్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పారు. వరద ప్రభావిత జిల్లాలలో వైమానిక దళానికి చెందిన అనేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి: TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..