అంతా సిద్ధూనే చేస్తున్నాడు.. అమరీంధర్ సింగ్ సతీమణి సంచలన వ్యాఖ్యలు

Punjab Congress Crisis: పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం తారస్థాయికి చేరింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేయడం తెలిసిందే.

అంతా సిద్ధూనే చేస్తున్నాడు.. అమరీంధర్ సింగ్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
Congress MP Preneet Kaur

Updated on: Aug 26, 2021 | 7:50 AM

Punjab Congress Crisis: పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం తారస్థాయికి చేరింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేయడం తెలిసిందే. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్‌ను మార్చాలని రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్ విఫలం చెందారని..అందుకే ఆయనపై తాము నమ్మకాన్ని కోల్పోయినట్లు చెబుతున్నారు.  అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి డిమాండ్లను తోసిపుచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ ఎదుర్కొంటుందని స్పష్టంచేసింది.

ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సతీమణి, ఎంపీ ప్రణీత్ కౌర్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూపై సంచలన ఆరోపణలు చేశారు. అమరీందర్ సింగ్‌‌కు వ్యతిరేకంగా గళంవిప్పుతున్న వారి వెనుక సిద్ధూ ఉన్నారని ఆమె ఆరోపించారు. పీసీసీ చీఫ్‌గా సిద్ధూను పార్టీ అధిష్టానం నియమించినప్పుడు అమరీందర్ సింగ్ పరిపక్వత కలిగిన నాయకుడిగా దాన్ని అంగీకరించారని చెప్పారు.

అమరీందర్ సింగ్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చిన ప్రణీత్ కౌర్.. కెప్టెన్‌పై సొంత పార్టీ వాళ్లే బహిరంగ విమర్శలు చేస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. సీఎం అమరీందర్ సింగ్‌ను మార్చాలంటూ బ్యానర్లు కట్టడం పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు.  కెప్టెన్ సారథ్యంలోనే పార్టీ పంజాబ్‌లో పలు విజయాలు సాధించిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ఇది సరైన సమయం కాదన్న ఎంపీ ప్రణీత్ కౌర్..  రెబల్స్ ఇప్పటికైనా మనసు మార్చుకుని పార్టీ దారిలోకి వస్తే మంచిదని హితవుపలికారు.

Also Read..

భారతీయుల కోసం జియోమీట్‌లో మార్పులు.. ఇక ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌ అందుబాటులోకి.

నీ బుల్లెట్టు బండెక్కి పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఎంపీ కవిత.. వైరల్ అవుతున్న వీడియో