
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో ప్రతిష్టించిన ప్రపంచ ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల లేజర్ లైటింగ్తో ఆదియోగి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అపురూప దృశ్యం స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అక్కడికి వచ్చిన భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
చీకటి పడుతుండగా వెల్లివిరిసిన త్రివర్ణ కాంతులు, ఆధ్యాత్మిక శోభతో కూడిన దేశభక్తి భావనను ప్రేక్షకుల్లో నింపాయి. దేశ స్వాతంత్ర్య ప్రయాణాన్ని, భారతీయుల ఐక్యతను చాటిచెప్పేలా రూపొందించిన ఈ ప్రత్యేక లైటింగ్ షో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతిపెద్ద ముఖ విగ్రహంగా గుర్తింపు పొందిన ఈ 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని జాతీయ పండుగల సందర్భంగా ఇలా ప్రత్యేక కాంతులతో అలంకరించడం సంప్రదాయంగా వస్తుంది. ఈశా కేంద్రానికి తరలివచ్చిన సందర్శకులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ భారతమాతకు జయజయధ్వానాలు పలికారు.
#Adiyogi #IndependenceDay pic.twitter.com/1zdsnAcpdZ
— Sadhguru (@SadhguruJV) August 14, 2026