Viral: అపార్ట్మెంట్ నుంచి ఘాటైన దుర్వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా.. భయంతో.!
అదొక అపార్ట్మెంట్. గత కొద్దిరోజులుగా ఘాటైన దుర్వాసన రావడం మొదలైంది. ఎక్కడో ఏదో ఎలుక చనిపోయిందనుకుని ఆక్కడ నివసిస్తున్న వాళ్లందరూ..

అదొక అపార్ట్మెంట్. గత కొద్దిరోజులుగా ఘాటైన దుర్వాసన రావడం మొదలైంది. ఎక్కడో ఏదో ఎలుక చనిపోయిందనుకుని ఆక్కడ నివసిస్తున్న వాళ్లందరూ.. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కు కంప్లయింట్ చేశారు. ఆయన పనివాళ్లను పిలిపించి మొత్తం అంతటిని శుభ్రం చేయించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.. దుర్వాసన ఇంకా రాసాగింది. ఈ క్రమంలోనే అది ఎక్కడ నుంచి వస్తోందో గమనించిన కొందరు.. ఏదో అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి అక్కడికి చేరుకొని మొదటి అంతస్తులోని ఓ ఫ్లాట్ తలుపులను బద్దలుకొట్టగా.. కనిపించిన భయానక దృశ్యాన్ని చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. ఆ ఫ్లాట్లో తల్లీకూతుళ్ల మృతదేహాలు పూర్తిగా కుళ్లిన స్థితిలో కనిపించాయి. దీంతో ఆ చుట్టుప్రక్కల ఒక్కసారిగా అలజడి రేగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆ ఫ్లాట్లో 64 ఏళ్ల రాజ్రాణి తన మూడో కూతురైన 39 ఏళ్ల జిన్నీ కరార్తో నివాసముండేదని స్థానికులు తెలిపారు. జిన్నీ మానసిక వ్యాధితో బాధపడేదని.. ఆ ఇరువురూ పగటిపూట అస్సలు బయటికి వచ్చేవారు కాదని అన్నారు. అప్పుడప్పుడూ రాత్రి సమయాన్ని డెలివరీ బాయ్స్ వచ్చి వెళ్తుండేవారని, అలాగే జిన్నీకి చికిత్స అందించే ఓ స్పీచ్ థెరపిస్ట్ కూడా వచ్చి వెళ్లేవారని స్థానికులు చెప్పారు.
మరోవైపు రాజ్రాణి భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడని పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆమె పెద్ద కూతుళ్లు ఇద్దరికీ పెళ్లై వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తల్లికూతుళ్లు ఇద్దరూ ఎక్కువగా చుట్టుప్రక్కల వారితో కలవకపోవడంతో.. ఇతర వ్యక్తులకు వారి గురించి పెద్దగా తెలియదని అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు తెలిపారు. కాగా, మృతదేహాలు పడిఉన్న తీరు బట్టి.. ఎవరో హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.




