Supreme Court: మైనర్పై అత్యాచారం కేసు! 40 ఏళ్ల పోరాటం తర్వాత సుప్రీం కోర్టులో న్యాయం
1986లో జరిగిన ఓ మైనర్ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 40 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడిన బాధితురాలికి న్యాయం జరిగింది. రాజస్థాన్ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసి, నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించాలని ఆదేశించింది. బాధితురాలి మౌనాన్ని పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు తీర్పును న్యాయస్థానం తప్పుబట్టింది.

40 ఏళ్ల క్రితం ఆమె ఓ చిన్నారి. ఆ సమయంలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్లింది. ఆ కోర్టు ఈ కోర్టు అంటూ ఆ బాలిక తల్లిదండ్రులు నిందితుడికి శిక్షపడాలని, తమ చిన్నారిపై అత్యాచారం చేసిన వాడికి చట్టం తప్పకుండా శిక్షిస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని నమ్మి.. ఏకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. వాళ్లు అనుకున్నట్లు చివరికి న్యాయం గెలిచింది. కానీ, చాలా ఆలస్యంగా గెలిచింది. 1986లో ఓ మైనర్పై జరిగిన అత్యాచారం కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి శిక్ష విధించాలని ఆదేశించింది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ బాలికపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. నవంబర్ 1987లో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, ట్రైయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తనపై జరిగిన నేరం గురించి ఏమీ చెప్పలేదు. సంఘటన గురించి అడిగినప్పుడు, బాధితురాలు మౌనంగా ఉన్నారని, మరింత అడిగినప్పుడు, మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇంకేమీ లేదని ట్రయల్ జడ్జి నమోదు చేశారు అని హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఈ ఆధారాలతో శిక్ష విధించలేమంటూ రాజస్థాన్ హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును హైకోర్టు వ్యవహరించిన తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది, తీర్పు అంతటా బాధితురాలి పేరును ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాధితురాలు మైనర్, ఆమె మౌనాన్ని పెద్దల మౌనంతో సమానంగా చూడలేం. తనపై జరిగిన దారుణం నుంచి ఉద్భవించిన మౌనం అయిఉండొచ్చు. మొత్తం ప్రాసిక్యూషన్ భారాన్ని ఆమె చిన్న భుజాలపై మోపడం అన్యాయం” అని న్యాయమూర్తులు అన్నారు. లైంగిక వేధింపులకు గురైన పిల్లలపై ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ, మొదటి అప్పీలేట్ కోర్టు, హైకోర్టు దిగువ కోర్టు ఫలితాలను ధృవీకరించే లేదా భంగం కలిగించే ముందు ఆధారాలను స్వతంత్రంగా అంచనా వేయాలని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. నిందితుడు ఇప్పటికే శిక్ష అనుభవించకపోతే, ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. “మైనర్ బాలిక, ఆమె కుటుంబం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు న్యాయం కోసం వేచి ఉండటం చాలా బాధాకరం” అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిందితుడిని రాజస్థాన్ హైకోర్టు జూలై 2013లో నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును పక్కన పెడుతున్నట్లు తీర్పు చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.