
తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో దారుణం చోటుచేసుకుంది. గొంతులో మాత్ర (ట్యాబ్లెట్) ఇరుక్కుపోయి 4 ఏళ్ల బాలుడి మృతిచెందాడు.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి యూనియన్లో పి.ఆర్. పల్లి అనే గ్రామంలో వేలు తన భార్య శశికళ, నాలుగేళ్ల బాలుడితో నివసిస్తున్నాడు. దంపతులిద్దరూ దుస్తులు నేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల బాలుడు యోగిత్కు జ్వరం వచ్చింది. చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యుడు మందులు, మాత్రలు రాశారు. దీంతో తల్లిదండ్రులు బాల యోగిత్కు మాత్ర ఇచ్చారు. కానీ ఊహించని విధంగా మాత్ర చిన్నారి యోగిత్ గొంతులో ఇరుక్కుపోయింది.. దీంతో బాలుడు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డాడు.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు..
ఈ ఘటనతో షాక్ కు గురైన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకుని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. ఈ క్రమంలోనే యోగిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో యోగిత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనపై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పిల్లల ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా, ఒక నిర్దిష్ట వయస్సు వరకు పిల్లలకు నేరుగా టాబ్లెట్ ఇవ్వకూడదని పేర్కొంటున్నారు. మీరు ఇవ్వాలనుకుంటే.. దానిని పాలు, రసం లేదా నీటిలో కలిపి ఇవ్వవచ్చు.. లేదా మీరు దానిని రెండుగా విడగొట్టి ఇవ్వాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లవాడు టాబ్లెట్ను పూర్తిగా మింగాడా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు అది గొంతులో ఇరుక్కుపోవచ్చు. కాబట్టి, టాబ్లెట్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీరు తాగించాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..