రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
మటన్ వండేటప్పుడు ముక్కలు మెత్తగా ఉడకకపోవడం, గ్రేవీ రుచిగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా? అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే ముదురు మటన్ కూడా మెత్తగా, రుచికరమైన గ్రేవీతో తయారవుతుంది. పచ్చి బొప్పాయి పేస్ట్, సరైన మసాలాలు, మటన్ను ముందుగా మగ్గించడం వంటి చిట్కాలతో ఇంట్లోనే నోరూరించే మటన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఏదైనా పండగొచ్చినా.. చుట్టాలొచ్చినా.. లేదా వీకెండ్ వచ్చినా.. ఎప్పుడైనా.. నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్ లాంటివి ఉండాల్సిందే.. ముఖ్యంగా చికెన్.. కంటే కూడా మటన్ ను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. ఇక్కడ ఒక సమస్య ఉంది.. సాధారణంగా మటన్ వండేటప్పుడు ముక్క సరిగ్గా ఉడకకపోవడం లేదా గ్రేవీ రుచిగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. మటన్ ముదురుగా ఉన్నా… ముక్క మెత్తగా, నోరూరించే గ్రేవీతో సులభంగా తయారు చేసుకోవచ్చు..
పాత పద్దతి లాగా.. కుక్కర్, లేదా మామూలు పాన్ (బాణలి) లోనే మటన్ ముక్క మెత్తగా ఉడికి, కమ్మని రుచితో నోరూరించే ‘మటన్ కర్రీ’ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
మటన్..
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు: తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు: కొద్దిగా, కారం – కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్: రుచికి, రంగుకు తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాట 1, ఉప్పు: రుచికి సరిపడా, కొత్తిమీర: కొద్దిగా, నూనె..
తయారీ విధానం:
మటన్ శుభ్రం చేయడం: శుభ్రంగా కడిగిన మటన్ను పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయల వేయించడం: పాన్లో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
మటన్ వేయించడం: ఉల్లిపాయలు వేగిన తర్వాత శుభ్రం చేసిన మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై మగ్గనివ్వాలి. మటన్ నుండి నీరు బయటకు వచ్చి నూనె తేలేవరకు ఉడకనివ్వాలి.
బొప్పాయి పేస్ట్ వేయడం: మటన్ వండేటప్పుడు పచ్చి బొప్పాయిని వండటానికి ముందు (మారినేషన్ సమయంలో 2స్పూన్లను కలపాలి.. లేదా కూర పొయ్యి మీద పెట్టిన వెంటనే వేయడం మంచిది..
కారం వేసి ఉడకబెట్టడం: నీరు ఇంకిపోతున్న సమయంలో కారం వేసి కలపాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉంచాలి..
మసాలాలు చేర్చడం: మటన్ ముక్క కాస్త ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మంచి రంగు కోసం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసి బాగా కలపాలి.
అనంతరం.. కుక్కర్ మూత పెట్టి.. 5 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.. అనంతరం విజిల్స్ వచ్చి ఆవిరి పోయిన తర్వాత మూత తీసి, చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి రుచికరమైన మటన్ కర్రీ సిద్ధమవుతుంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
