
యువకులు ఎక్కువ సమయం పని చేయాలి.. కనీసం రోజులో 12 గంటలు, వారంలో 70 గంటలు వర్క్ చేయాలి.. తద్వారా దేశంలోని మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది.. అంటూ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్న మాటలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. దానికి జేఎస్ డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ మద్దతు పలికారు. కాగా దీనిపై చాలా మంది విమర్శలు కూడా గుప్పించారు. కొంతమంది సపోర్టు చేస్తుండగా.. మరికొంతమంది ఆయన వ్యాఖ్యలు చాలా దారుణమంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ స్పందన మాత్రం బాగా వైరల్ అయ్యింది. బెంగళూరులో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ దీపక్ కృష్ణ మూర్తి తన ఎక్స్(ట్విట్టర్)ఖాతాలో యువకుల పనిగంటలు, దాని ప్రభావంపై అందరికీ అర్ధమయ్యే రీతిలో ఓ పోస్ట్ పెట్టారు. ఎక్కువ గంటల పని వ్యక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఈ పని ఒత్తిడి వల్ల ఈ జనరేషన్ మొత్తం గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఇటీవల కాలంలో యువకుల్లో ఎక్కువవుతున్న గుండె, మెదడు పోటులకు ఈ పని గంటలు, ఒత్తిడే ప్రధాన కారణమని కూడా ఆయన వివరించారు.
ఆయన ఓ గుండె వ్యాధుల సంబంధిత వైద్యుడిగా ఈ పోస్ట్ పెట్టారు. రోజులో ఉండే 24 గంటల్లో 12 గంటలు ఉద్యోగం లేదా పని కోసమే వెచ్చిస్తే.. దాని ప్రభావం తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆయన వివరించాడు. ఆ పోస్టులో ఉన్న సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం..
24 hours per day (as far as I know)
If you work 6 days a week – 12h per day
Remaining 12h
8 hours sleep
4 hours remain
In a city like Bengaluru
2 hours on road
2 hours remain – Brush, poop, bathe, eat
No time to socialise
No time to talk to family
No time to exercise… https://t.co/dDTKAPfJf8— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 27, 2023
మనకు రోజులో 24 గంటలు ఉంటాయి.. మీరు వారానికి 6 రోజులు.. రోజుకు 12 గంటల పాటు పని చేస్తే, మీకు ఇక రోజులో 12 గంటలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ 12 గంటలలో, నిద్ర కోసం 8 గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక మిగిలింది కేవలం నాలుగు గంటలు మాత్రమే. ఈ నాలుగు గంటల్లోనే మిగిలిన అన్ని కార్యకలాపాలు, వ్యక్తిగత పనులతో పాటు పూర్తి చేయాల్సి ఉంటుంది. బెంగళూరు వంటి మహానగరాల్లో తరచుగా ప్రయాణ సమయాలు ఎక్కువగా ఉంటాయి. బయటకు వచ్చామంటే కనీసం 2 గంటలు రోడ్డుపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మిగిలింది రెండు గంటలు. వ్యక్తిగత పరిశుభ్రత, భోజనం, ప్రాథమిక పనుల వంటి రోజువారీ దినచర్యలకు అది సరిపోతుంది. అయిపోయాయి. 24 గంటలు పూర్తయిపోయాయి. ఇక సాంఘికీకరణ, ఫ్యామిలీతో గడపటానికి, వ్యాయామం లేదా విశ్రాంతి కార్యకలాపాలకు సమయం ఉండదు. అంతేకాకుండా, సాధారణ పని గంటల తర్వాత కూడా ఉద్యోగులు ఈ-మెయిల్లు, కాల్లకు ప్రతిస్పందించాలని చాలా కంపెనీలు ఆశిస్తుంటాయి. ఇటువంటి సమయంలో ఇక వారి వ్యక్తిగత జీవితానికి సమయం ఉండదు.
ఈ చర్య వ్యక్తులు మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ కృష్ణమూర్తి తన పోస్ట్ ద్వారా వివరించారు. ఇప్పటికే ఉన్న ఒత్తిళ్ల వల్ల ఎక్కువగా యువకుల్లో గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయని, ఈ తరహా చర్యలవల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందన్నారు. ఈ పోస్ట్ కింద కామెంట్ల విభాగంలో ఆయన నిరుద్యోగాన్ని తగ్గించడానికి , యువకులు ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కలిగి ఉండటానికి ప్రభుత్వం మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..