
ఆధునిక కాలంలో అందరూ నాన్స్టిక్, స్టీల్ లేదా అల్యూమినియం గిన్నెలను వంటల కోసం వాడుతున్నారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం పూర్వీకులు వాడిన ఇత్తడి పాత్రలకు శరీర రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఈ ఏడాది అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా.. ఇత్తడి గిన్నెల్లో టీ తయారు చేయడం వల్ల కలిగే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు వెలుగులోకి వచ్చాయి.
1. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు:
ఇత్తడి అనేది రాగి, జింక్ ల మిశ్రమం. దీనికి సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ పాత్రలో టీని మరిగించినప్పుడు, అందులోని పోషకాలు టీలోకి చేరి శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
2. సమానమైన వేడి
ఇత్తడి పాత్రల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి వేడిని సమానంగా విస్తరింపజేస్తాయి. దీనివల్ల టీ పొడి, పాలు, అల్లం, యాలకులు అన్నీ కూడా సమానంగా, బాగా ఉడుకుతాయి. ఇలా నిదానంగా చక్కగా ఉడకడం వల్ల టీ ఫ్లేవర్ ఎంతో అద్భుతంగా రావడమే కాకుండా రుచి కూడా రెట్టింపు అవుతుంది.
3. గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్:
సాధారణంగా చాలా మంది ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్ లేదా ఎసిడిటీ వస్తుందని భయపడుతుంటారు. అయితే ఇత్తడి పాత్రలో కాచిన టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని నమ్ముతారు.
4. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఇత్తడిలో ఉండే జింక్ మన శరీరానికి మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే రోజూ ఇత్తడి పాత్రలో కాచిన టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
ఒక్క విషయం గుర్తుంచుకోండి!
ఇత్తడి గిన్నెలో టీ కాచడం మంచిదే అయినప్పటికీ.. టీ కాచిన వెంటనే దాన్ని వేరే కప్పుల్లోకి లేదా గ్లాసుల్లోకి వడకట్టేయాలి. టీని ఎక్కువ సేపు ఇత్తడి పాత్రలోనే ఉంచేస్తే, పాలలోని యాసిడ్స్ ఇత్తడితో చర్య జరిపి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. అలాగే లోపల కలయ్ (Tin coating) వేసిన ఇత్తడి పాత్రలను వాడటం మరింత సురక్షితం.