
ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం వ్యవసాయంలో అధికంగా పురుగుమందులు, రసాయనాలు వినియోగిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో లభించే ద్రాక్ష పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్రాక్ష పండ్ల ఉపరితలంపై ఇతర పండ్లతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందుకే వాటిని కేవలం నీటితో కడగడం కాకుండా, ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రం చేయడం అవసరం.
ద్రాక్ష పంటను పురుగులు, శిలీంధ్రాలు సులభంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు సాగుదారులు పంటపై తరచుగా పురుగుమందులు, ఫంగిసైడ్లు పిచికారీ చేస్తారు. ఫలితంగా ద్రాక్ష పండ్లపై రసాయనాల అవశేషాలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి. ఆ నీటిలో ద్రాక్ష పండ్లను 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం శుభ్రమైన నీటితో మరోసారి కడగాలి. ఉప్పు నీరు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను తగ్గించడంలో సహాయపడుతుంది.
అర టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి ద్రాక్ష పండ్లను అందులో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్వచ్ఛమైన నీటితో కడగాలి. ఈ విధానం పండ్లపై ఉన్న కొన్ని పురుగుమందుల అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక గిన్నె నీటిలో కొద్దిగా తెల్ల వెనిగర్ కలిపి, అందులో ద్రాక్ష పండ్లను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం శుభ్రమైన నీటితో బాగా కడగాలి. వెనిగర్ పండ్లపై ఉండే మురికి, సూక్ష్మక్రిములను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ద్రాక్ష పండ్లను శుభ్రం చేసిన తర్వాత వాటిని ఒక శుభ్రమైన పత్తి గుడ్డ లేదా టిష్యూ పేపర్పై పరచి పూర్తిగా ఆరనివ్వాలి. తడి ఉన్నప్పుడే ఫ్రిజ్లో ఉంచితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రిజ్లో నిల్వ చేయడం మంచిది. ద్రాక్ష పండ్లను శుభ్రంగా కడగడం వల్ల మురికి, కొన్ని పురుగుమందుల అవశేషాలు, సూక్ష్మక్రిములను తగ్గించవచ్చు. ఆరోగ్య రక్షణ కోసం పండ్లను తినే ముందు సరైన విధంగా శుభ్రపరచడం అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం.