
పైనాపిల్..చూడగానే నోరూరించే పండు.. తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ పైనాపిల్ను ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే నాలుకపై చిన్నపాటి మంట, దురద లేదా ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. చాలామంది ఇది పండులో ఏదైనా లోపం ఏమో అని భయపడతారు. కా, దీని వెనుక ఒక ఆసక్తికరమైన జీవక్రియ దాగి ఉంది. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం సిద్ధహస్తురాలు. సాధారణంగా మనం ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాం.. కానీ పైనాపిల్ విషయంలో.. మనం దానిని నములుతున్నప్పుడు, అందులోని బ్రోమెలైన్ మన నోటిలోని సున్నితమైన కణజాలం, నాలుకపై ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే సాంకేతికంగా చెప్పాలంటే.. మనం పైనాపిల్ను తింటుంటే, పైనాపిల్ మనల్ని తింటుందన్నమాట. అయితే ఈ దురదను చూసి కంగారు పడక్కర్లేదు.
ఈ ఎంజైమ్ మన కడుపులోకి వెళ్లగానే అక్కడి జీర్ణ రసాల వల్ల అది జీర్ణమైపోతుంది. నిజానికి ఇది జీర్ణక్రియకు, శరీరంలో వాపులను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. మన నోటిలోని కణాలు చాలా వేగంగా పునరుత్పత్తి చెందుతాయి. అందుకే పైనాపిల్ తిన్న తర్వాత కలిగే ఆ మొద్దుబారినట్లు ఉండే అనుభూతి కొద్దిసేపట్లోనే తగ్గిపోతుంది.
పైనాపిల్ రుచిని ఆస్వాదిస్తూనే, ఆ దురద నుండి తప్పించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి
ఉప్పు నీటి చిట్కా: పైనాపిల్ ముక్కలను కోసిన తర్వాత కొద్దిసేపు ఉప్పు నీటిలో నానబెట్టండి. ఉప్పు బ్రోమెలైన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
వేడి చేయడం: పైనాపిల్ను గ్రిల్ చేసినా లేదా ఉడికించినా అందులోని ఎంజైమ్లు నిర్వీర్యం అవుతాయి. అందుకే పైనాపిల్ పిజ్జా తిన్నప్పుడు నాలుక దురద పెట్టదు.
పండిన పండునే ఎంచుకోండి: పచ్చి పైనాపిల్లో ఈ ఎంజైమ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పండు బాగా పండిన తర్వాత తింటే ఈ సమస్య తక్కువగా ఉంటుంది.
మధ్య భాగం వద్దు: పైనాపిల్ మధ్యలో ఉండే గట్టి భాగంలో బ్రోమెలైన్ ఎక్కువగా ఉంటుంది. దానిని పక్కన పెడితే దురద తగ్గుతుంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..