
మనలో చాలా మందికి భోజనం తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. మరికొందరైతే బరువు పెరగడానికనో లేదా రుచి కోసమో బనానా మిల్క్షేక్లను ఇష్టంగా తాగుతుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్ ఉంటే.. అరటిపండులో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. విడివిడిగా ఇవి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం దీనిపై ఏమంటోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే ఆహారాల మధ్య సమతుల్యత ఉండాలి. పాలు బరువైనవి, చల్లదనాన్ని ఇచ్చేవి. అరటిపండు తేలికగా అనిపించినా, జీర్ణం కావడానికి పట్టే సమయం పాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటి జీర్ణక్రియ రేటు వేర్వేరుగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది.
పాలు, అరటిపండు కలిపి తీసుకున్నప్పుడు అవి కడుపులో పూర్తిగా జీర్ణం కాక కిణ్వ ప్రక్రియకు గురవుతాయి. దీనివల్ల..కడుపులో ఆమ్లత్వం పెరిగి అసిడిటీకి దారితీస్తుంది. అసంపూర్ణ జీర్ణక్రియ వల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మఅజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు, అరటిపండు రెండూ శరీరంలో కఫం పెంచే స్వభావం కలవి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల సైనస్ వాపు, జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో పేరుకుపోయిన ఈ ఆమ్లత్వం చర్మంపై కూడా ప్రభావం చూపి చర్మ వ్యాధులకు దారితీయవచ్చు.
మీ జీర్ణవ్యవస్థ చాలా బలంగా ఉంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల తక్షణమే పెద్ద సమస్యలు రాకపోవచ్చు. కానీ తరచుగా ఇలా తీసుకోవడం దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. బరువు పెరగాలనుకునే వారు లేదా మిల్క్షేక్ ఇష్టపడే వారు వీటిని కలిపి తీసుకునేటప్పుడు కొద్దిగా యాలకులు లేదా శొంఠి పొడిని చేర్చుకోవడం వల్ల దోషాలు తగ్గుతాయని కొందరు సూచిస్తుంటారు. అరటిపండు తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల గ్యాప్ ఇచ్చి పాలు తాగడం ఉత్తమమైన పద్ధతి. రుచి కంటే ఆరోగ్యం ముఖ్యం అని గుర్తించండి.