
పావ్ భాజీ ఒక రుచికరమైన స్ట్రీట్ ఫుడ్. రొట్టె రకరకాల కూరగాయలతో తయారు చేసిన మసాలా మిశ్రమంతో కలిపి వడ్డిస్తారు. ఇది కడుపునింపే రుచికరమైన వంటకం. రెస్టారెంట్స్ లో లేదా స్ట్రీట్ ఫుడ్ గా దొరికే ఈ పావ్ భాజీని తయారు చేయడం సులభం. తెలియాల్సింది దీని తయారీకి కావాల్సిన పదార్ధాలు, విధానం మాత్రమే.. ఈ పావ్ భాజీలో ఇచ్చే మసాల కూరని సాధారణంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, మిరపకాయలు, బఠానీలు, క్యాప్సికం, టొమాటో వంటి కూరగాయలను ఉపయోగిస్తారు. ఈ మసాలా కూరగాయల మిశ్రమంతో వెన్నతో కాల్చిన పావ్(బన్ను)తో అందిస్తారు. వేడి వేడిగా తింటే లోట్టలేసుకుంటూ ఎన్నైనా తినేస్తారు. ఈ రోజు ఇంట్లోనే పావ్ భాజీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
బంగాళా దుంపలను , క్యారెట్, బఠానీలను ఒక కుక్కర్ లో వేసి.. తగినన్ని నీరు పోసి ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఉడికిన బంగాళా దుంపలను , క్యారెట్, బఠానీలను ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా మాష్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో వెన్న వేసి వేడి చేయాలి. ఈ వెన్నలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమోట ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ కూరగాయలు మెత్తగా ఉడికిసిన తర్వాత కారం, పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పావ్ భాజీ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఐదు నిముషాలు ఈ మిశ్రమాన్ని వేయించి ఇప్పుడు అందులో మాష్ చేసిన బంగాళా దుంపలు, క్యారెట్, బఠానీల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత కూర తయారీకి కావల్సినంత నీరు పోసి ఒక పది నిముషాలు ఉడికించాలి. చివరిగా కట్ చేసిన కొత్తిమీర, నిమ్మ రసం వేసి కలపాలి. అంతే మసాలా కూర రెడీ.
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని వేడి చేసి వెన్న వేసి మధ్యగా కట్ చేసిన పావ్ లను పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకూ కాల్చాలి. ఇప్పుడు ఈ వేడి వేడి బ్రెడ్స్ తో మసాలా కూర కలిపి వడ్డించాలి. ఇష్టమైన వారు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తినొచ్చు.
(అయితే ఈ పావ్ భాజీ మసాలా కూరను తయారు చేసుకోవడానికి మీ రుచికి అనుగుణంగా కూరగాయలను చేర్చుకోవచ్చు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..