
ప్రస్తతుం వాతావరణ మార్పుల సమయం కావడంతో చాలామందికి జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి శ్వాసకోశ సమస్యలు సాధారణం. ఈ సమస్యలతో పాటు వికారం, నీరసం కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన ఔషధ గుణాలున్న పదార్థాలతో కషాయం తయారుచేసుకుని తాగడం వల్ల శీఘ్ర ఉపశమనం పొందవచ్చు. ఈ కషాయం కేవలం జలుబు, దగ్గును తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రెండు సంవత్సరాల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీనిని సురక్షితంగా తీసుకోవచ్చు.
1. దాల్చినచెక్క (రెండు అంగుళాలు): ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగివుండి, శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
2. లవంగాలు (ఐదు లేదా ఆరు): లవంగాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడతాయి.
3. జీలకర్ర (ఒక టీ స్పూన్): జీలకర్ర అలర్జీలను తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇది పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది.
4. వాము (అర టీ స్పూన్): వాము జీర్ణశక్తిని పెంపొందించే గుణాలు పుష్కలంగా కలిగివుంది.
5. మిరియాలు (ఒక టీ స్పూన్, క్రష్ చేసినవి): మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
6. అల్లం (ఒక అంగుళం, క్రష్ చేసినది): అల్లం వికారాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
7. పుదీనా (రెండు రెమ్మలు): పుదీనా గ్యాస్ను నియంత్రిస్తూ, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
8. తులసి ఆకులు (ఒక రెమ్మ): తులసి ఆకులో అనేక రకాల జబ్బులకి ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
9. లెమన్ గ్రాస్ (రెండు, మూడు టేబుల్ స్పూన్లు, కట్ చేసినవి):లెమన్ గ్రాస్ ఇన్ఫెక్షన్లను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అందుబాటులో లేకపోతే నిమ్మ చెక్కను ఉపయోగించవచ్చు.
10.పసుపు (పావు టీ స్పూన్): పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలకు ప్రసిద్ధి.
11. బెల్లం పొడి (ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్):బెల్లానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఈ కషాయంలో బెల్లం శ్వాసకోశ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
1. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో ఒక గ్లాసు (సుమారు 250 మి.లీ) నీటిని పోయాలి.
2. నీరు కొద్దిగా వేడెక్కగానే పైన పేర్కొన్న దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, వాము, క్రష్ చేసిన మిరియాలు, క్రష్ చేసిన అల్లం, పుదీనా రెమ్మలు, తులసి ఆకులు, కట్ చేసిన లెమన్ గ్రాస్ (లేదా నిమ్మ చెక్క), పసుపు వేయాలి.
3. ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత చివరగా బెల్లం పొడిని లేదా తురుముకున్న బెల్లాన్ని కలపాలి.
4. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి, మీడియం మంటపై రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి.
5. తరువాత స్టవ్ ఆపేసి, కషాయాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి, అప్పుడు వడకట్టి తీసుకోవాలి.
జలుబు, దగ్గు, గొంతునొప్పి వచ్చినప్పుడు ఉదయం ఒక టీ గ్లాసు, సాయంత్రం ఒక టీ గ్లాసు చొప్పున రెండు లేదా మూడు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగాలి. ఇది అద్భుతమైన ఉపశమనాన్ని అందించి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.