
ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన సమయంలో తినడం కూడా అంతే ముఖ్యం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఒక నిర్ణీత సమయంలో తీసుకోవాలని చెప్పినట్లే రాత్రి భోజనం కూడా నిర్ణీత సమయానికి ముగించాలి. నేటి బిజీ లైఫ్స్టైల్లో చాలా మంది రాత్రి 9 గంటల తర్వాత ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనం ఎప్పుడు చేయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చాలా మంది రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం మంచి అలవాటు కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య రాత్రి భోజనం పూర్తి చేయాలి. ఈ అలవాటు జీర్ణవ్యవస్థతో సహా మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ: త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల పడుకునే ముందు శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.
నాణ్యమైన నిద్ర: మనం పడుకునే 2 నుండి 3 గంటల ముందు భోజనం పూర్తి చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆలస్యంగా తినడం జీర్ణక్రియకు అంతరాయం కలిగించి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది.
బరువు నిర్వహణ : రాత్రిపూట త్వరగా తినే అలవాటు బరువును అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఇది శరీరం కేలరీలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది.
హార్మోన్ల సమతుల్యత: సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య రాత్రి భోజనం చేయడం వల్ల మెలటోనిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఇది శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
రక్తంలో చక్కెర: సాయంత్రం త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి, రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడం ఉత్తమం.
మరిన్ని లైఫ్స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..