
నాన్వెజ్ ప్రియులు రొయ్యలు (Prawns) ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా వండుకోని ఆరగిస్తారు.. సాధారణంగా చికెన్ మటన్ తో పోలిస్తే.. రొయ్యల టేస్టే వేరు. అయితే.. ప్రాన్స్.. ప్రోటీన్, అయోడిన్, విటమిన్ B12తో కూడిన అద్భుతమైన పోషకాహారం. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉండి.. బరువు తగ్గాలనుకునేవారికి, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడానికి దోహదపడతాయి. అయితే. కొన్ని టిప్స్ ద్వారా.. కమ్మనైనా రొయ్యల కూర.. ఇంటిల్లిపాదికీ నచ్చే ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ఈ వంటకాన్ని సులభంగా, రుచికరంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ కథనంలో తెలుసుకోండి..
రొయ్యలను సిద్ధం చేయడం: మొదట అర కేజీ రొయ్యలను తీసుకొని, వాటి పై పొట్టును తొలగించి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి.
ఉల్లిపాయ పేస్ట్ తయారీ: ఒక మిక్సర్ జార్ లోకి ఒక కప్పు ఉల్లిపాయలని తీసుకొని మెత్తగా లేదా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా దినుసులు వేయించడం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, నాలుగైదు లవంగాలు, రెండు యాలకులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్ గా వేయించాలి. ఈ మసాలా దినుసుల ఫ్లేవర్ కూరకి మంచి రుచిని అందిస్తుంది.
ఉల్లిపాయ పేస్ట్ వేయించడం: ఇందులోనే గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ ను వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు మూడు నిమిషాలు దోరగా వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి: ఉల్లిపాయ పేస్ట్ దోరగా వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చి మిరపకాయలను, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి, నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించాలి. ఇది కూర రుచికి చాలా ముఖ్యం.
పసుపు, రొయ్యలు వేయించడం: ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి, కడిగి సిద్ధంగా ఉంచుకున్న రొయ్యలను వేసి నూనెలోనే రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి. దీనివలన రొయ్యలు నూనెలో వేగి మంచి రుచి వస్తుంది.
కారం, మసాలాలు కలపడం: రెండు మూడు నిమిషాలు రొయ్యలను వేయించిన తర్వాత, రెండు మూడు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసి బాగా కలపాలి.
ఉడికించడం: ఇలా కలిపాక, మంటను లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. దీనివలన రొయ్యలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి.
చింతపండు రసం, నీళ్లు కలపడం: ఇప్పుడు అర కప్పు చింతపండు రసం (ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసినది) వేసి కలపాలి. ఆపై కూర కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను పోసి, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదారు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకుండా చూసుకోవాలి.
చివరిగా అలంకరణ: రొయ్యలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కసూరి మేతి (లేనట్లయితే మెంతులను దోరగా వేయించి పొడి చేసి వాడుకోవచ్చు), కొద్దిగా కొత్తిమీర ఆకును వేసి బాగా కలపాలి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే.
ఈ విధంగా తయారుచేసిన కమ్మనైనా రొయ్యల కూర అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో చాలా రుచిగా ఉంటుంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..