షుగర్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమవుతుంది..? అపోహల కాదు అసలు విషయాలు తెలుసుకోండి..
మామిడి పండు తింటే ఒళ్ళు వేడి చేస్తుందా? మొటిమలు వస్తాయా? అన్నిటికంటే ముఖ్యంగా షుగర్ ఉన్నవారు మామిడి పండును ముట్టుకోకూడదా? వీటిపై సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది..? మామిడి పండుపై ఉన్న పాత అపోహలను తొలగించి, షుగర్ పేషెంట్లు సురక్షితంగా వీటిని ఎలా ఆస్వాదించవచ్చో తెలుసుకుందాం..

వేసవి వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు పండ్ల రాజు మామిడిపైనే ఉంటాయి. ఆ రుచి, ఆ సువాసన అమోఘం. కానీ షుగర్ ఉన్నవారు మాత్రం మామిడి పండును చూడగానే ఒక్క క్షణం భయపడతారు. “ఇది తింటే షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయేమో? ఒళ్లు వేడి చేస్తుందేమో?” అన్న ఆందోళన వారిలో ఉంటుంది. మరి నిజంగానే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడికి దూరంగా ఉండాలా? ఈ విషయంలో బెంగళూరులోని ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్ ఎండోక్రినాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహేష్ డి.ఎమ్ కీలక విషయాలు వివరించారు.
మామిడి పండు – గ్లైసెమిక్ ఇండెక్స్ రహస్యం
మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయనేది నిజమే. అయితే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుండి 56 మధ్య ఉంటుంది. 55 కంటే తక్కువ GI ఉన్న ఆహారాలను లో-గ్లైసెమిక్గా పరిగణిస్తారు. అంటే నియంత్రిత మోతాదులో తీసుకున్నప్పుడు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు.
మధుమేహులు ఎలా తినాలి?
మధుమేహం ఉన్నవారు మామిడిని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ పరిమాణం ముఖ్యం.
మోతాదు: అర కప్పు కోసిన మామిడి ముక్కలు లేదా ఒక చిన్న ముక్కను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
కాంబినేషన్: మామిడి పండును ఒంటరిగా కాకుండా.. నట్స్, విత్తనాలు లేదా పెరుగు వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవాలి. దీనివల్ల చక్కెర శోషణ నెమ్మదిస్తుంది.
పండుగా తినడమే మేలు: మామిడిని జ్యూస్ లేదా షేక్స్ రూపంలో కాకుండా ముక్కలుగా కోసుకుని తినడమే సురక్షితం. పండులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు, గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది.
అపోహలు – వాస్తవాలు
మామిడి పండ్ల గురించి సమాజంలో ఉన్న కొన్ని అపోహలపై డాక్టర్ మహేష్ క్లారిటీ ఇచ్చారు.
ఒళ్లు వేడి చేస్తుందా?: మామిడి వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని లేదా మొటిమలు వస్తాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే చక్కెర ఎక్కువగా ఉండే డెజర్ట్ల రూపంలో తీసుకుంటే చర్మ సమస్యలు రావచ్చు.
నానబెట్టడం ఎందుకు?: మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం వల్ల వాటిపై ఉండే మురికి, పురుగుమందుల అవశేషాలు, జిగట రసం తొలిగిపోతాయి. ఇది పరిశుభ్రతకు మంచిది.
వేసవిలో వరప్రసాదం
మామిడిలో నీరు, పొటాషియం, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో శరీరానికి తేమను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా పచ్చి మామిడితో చేసే ఆమ్ పన్నా వంటి డ్రింక్స్ వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అయితే ప్యాక్ చేసిన మామిడి జ్యూసులకు దూరంగా ఉండండి. వాటిలో ఉండే అదనపు చక్కెరలు మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
