
ఇళ్లలో రోజూ వాడే అగరబత్తులు, మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారంపై క్యాన్సర్ నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇళ్లలో సాధారణంగా అగరబత్తులు లేదా దోమల కాయిల్స్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందనడానికి స్పష్టమైన లేదా నిర్దిష్టమైన ఆధారాలు లేవని ఆంకాలజిస్టులు స్పష్టం చేశారు. క్యాన్సర్ అనేది జన్యుపరమైన అంశాలు, పొగాకు, మద్యం వాడకం, అంటువ్యాధులు, ఇతర జీవనశైలి కారకాల కలయిక వల్ల వస్తుంది. కేవలం రోజువారీ పూజల కోసం అగరబత్తులు వెలిగించినంత మాత్రాన క్యాన్సర్ బారిన పడతారని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
క్యాన్సర్ నేరుగా రాకపోయినా, ఈ పొగలో ఉండే సూక్ష్మ కణాలు, రసాయనాలు ఇంటి లోపలి గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా, గాలి ఆడని గదుల్లో తలుపులు, కిటికీలు మూసివేసి ఉండే చిన్న గదుల్లో వీటిని ఎక్కువ సేపు వెలిగించినప్పుడు పొగ గదిలోనే పేరుకుపోతుంది. రోజూ రాత్రంతా మూసివున్న గదిలో మస్కిటో కాయిల్స్ పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇంటి పరిసరాలను, గాలిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి వైద్యులు క్రింది సూచనలు చేశారు. అగరబత్తులు లేదా కాయిల్స్ వెలిగించినప్పుడు గది కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. దోమల నివారణకు పొగనిచ్చే కాయిల్స్ కంటే దోమతెరలు లేదా పొగ రాని ఎలక్ట్రిక్ వేపరైజర్లు వాడటం సురక్షితం. ఒకేసారి ఎక్కువ అగరబత్తులు వెలిగించకుండా, తక్కువ పొగనిచ్చే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. నిద్రించే గదుల్లో రాత్రంతా కాయిల్స్ వెలిగించి ఉంచడం ఏమాత్రం మంచిది కాదు.
అగరబత్తులు, దోమల కాయిల్స్ వాడకం వల్ల నేరుగా క్యాన్సర్ రాకపోయినా, మూసివున్న ప్రదేశాల్లో ఆ పొగను నిరంతరం పీల్చడం శ్వాసకోశ వ్యవస్థకు హానికరం. కాబట్టి సరైన వెలుతురు, గాలి ప్రసరించే వాతావరణంలో మాత్రమే వీటిని ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..