AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విప్రో ఉద్యోగులకు మరో అవకాశం.. వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు

ఐటీ దిగ్గజం విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

విప్రో ఉద్యోగులకు మరో అవకాశం.. వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు
Balaraju Goud
|

Updated on: Nov 03, 2020 | 4:04 PM

Share

ఐటీ దిగ్గజం విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు మరికొన్ని రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా విప్రో కూడా తమ ఉద్యోగులకు ఈ అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌, అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులంతా జనవరి 18, 2021 వరకు ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాలకు చెందిన వారే ఉండటం విశేషం.

భారత్‌లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. శీతకాలం మొదలవ్వడంతో ఇంకా భారీ స్థాయిలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక అమెరికాలో కరోనాకు నియంత్రణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను ఈ మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది.

ఇక మిగతా దేశాలకు సంబంధించి అక్కడి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బి.భానుమూర్తి ఈ మెయిల్ ద్వారా పేర్కొన్నారు. తెలిపారు. విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ సెప్టెంబరులో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పనితీరు పూర్తిగా మారిందని.. బహుశా భవిష్యత్తులో ఉద్యోగులంతా ఆఫీసుకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని అభిప్రాయపడడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో మార్చిలో అన్ని ఐటీ సంస్థలు లాక్ డౌన్ లో వెళ్లిపోయాయి. దీంతో భారత్‌కు చెందిన ఐటీ సంస్థలు విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగడం వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం సత్ఫలితాలిస్తుండడంతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని శాశ్వతం చేశాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఉద్యోగుల్లో సగానికి పైగా మంది రాబోయే ఐదు నుంచి పదేళ్ల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ట్విటర్‌, స్క్వేర్‌, మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో పయనించాయి.

Follow Us