AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఈ సారైనా గట్టెక్కేనా..?

ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు.. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. దీంతో సుమారు 50 వేల క్యాబులు సేవలను నిలిపివేశాయి. కిలో మీటర్‌కు రూ.22 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను […]

ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఈ సారైనా గట్టెక్కేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 12:11 PM

Share

ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు.. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. దీంతో సుమారు 50 వేల క్యాబులు సేవలను నిలిపివేశాయి. కిలో మీటర్‌కు రూ.22 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు ఐటీ కాంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లను అమలు చేయాలని క్యాబ్ డ్రైవర్ల జేఏసీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు డ్రైవర్ల పై దాడుల కేసులు పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో తమ ఆదాయం పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా ఉబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. క్యాబ్ డ్రైవర్ కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ 2017 అక్టోబర్ 23న బంద్‌ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు ఓ రేంజ్‌లో ఆందోళన చేశారు. గతంలో హైదరాబాద్ మహానగరంలో క్యాబ్‌ల వినియోగం పెరగడంతో ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాయి. కేవలం రూ.30 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును మీ సొంతం చేసుకోవచ్చని, నెలకు రూ.70 వేలు సంపాదించుకోవచ్చని డ్రైవర్లకు ఆశ చూపాయి. దీంతో నగరంలోని కొన్ని వందల మంది డ్రైవర్లు ఉబర్, ఓలా సంస్థల్లో చేరి కారు ఓనర్లుగా మారారు.

అయితే తమకు రావాల్సిన నెలసరి మొత్తాన్ని ఫైనాన్స్, మెయింటెనెన్స్ రూపంలో ఈ రెండు సంస్థలు కాజేయడం మొదలుపెట్టాయి. నెలకు రూ.70 వేలు అని చెప్పి.. అన్ని పోను రూ.15 వేలు ముట్టచెప్పడం మొదలుపెట్టాయి. దీంతో సొంతంగా కార్లు కొనుక్కుని.. ఓలా, ఉబర్ సంస్థల్లో చేరిన డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నిటికీ పరిష్కారం చూపించాలంటూ డ్రైవర్లు ఆందోళనలు చేశారు. కాని ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి.. బంద్‌ను ఆపివేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినప్పటికీ 2018లో కూడా ఉబర్, ఓలా డ్రైవర్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. మరి ఇప్పటి నుంచైనా.. క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సామాన్య ప్రజానీకం అభిప్రాయపడుతోంది.