భక్తుల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భక్తులతో భవదీయుడు’ పేరిట ఫోన్ఇన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి భక్తుల నుండి వినతులకు ఆయన స్వీకరించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణవనంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి వారి ఆలయం తదితర తితిదే స్థానికాలయాల గురించి సమాచారాన్ని, ఆయా ఆలయాల్లో నెలకొన్న సమస్యలను, తమ అభిప్రాయాలను భక్తులు ఈ కార్యక్రమం ద్వారా తెలపవచ్చు.
తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వసతి సముదాయాల్లోని సౌకర్యాలపై సూచనలు, సలహాలను ఈ కార్యక్రమంలో జేఈవో స్వీకరించనున్నారు.
‘భక్తులతో భవదీయుడు’ కార్యక్రమం తొలిసారిగా ఈనెల 15న జరగనుంది. ప్రతినెల మూడో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30నుంచి 9.30గంటల వరకు తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్ ద్వారా 0877-2234777 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.