దిల్లీ: ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యే కీలక అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల సృష్టిలో విఫలమైన భాజపా ప్రభుత్వం.. ఈ అంశంలో ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రచారాల్లోని అవాస్తవాలను భారత పరిశ్రమల శాఖ(సీఐఐ) బయటపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మిగిలిన వారు సైతం గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
దేశంలో నెలకొన్న నిరుద్యోగం తమను ఆందోళనకు గురిచేస్తోందని సీఐఐ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటు రంగం నుంచి కొత్త పెట్టుబడులు రావడం లేదని తెలిపింది. గిరాకీ తగ్గడంతో పాటు.. తయారీ రంగం డీలా పడడం ఇందును కారణమని సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. ప్రస్తుతం 6-16 ఏళ్ల వయసు ఉన్న వారికి పదేళ్ల తరవాత ఉద్యోగం కల్పించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
Glad that CII has found its voice and has exposed the government's bogus claims on job creation. Hope that others also will speak up.
— P. Chidambaram (@PChidambaram_IN) March 9, 2019