Temperature decreases in telangana: రాష్ట్రంలో చలి పులి తన పంజాను విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లోల్లో చలి వణికిస్తోంది. ఇప్పటికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, వాయువ్య భారతం నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తుండడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత బాగా పెరగనుంది. ఇక ఆదిలాబాద్, కుమ్రం భీమం జిల్లాల్లో గతంలో లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అర్లి, గిన్నెధర ప్రాంతాల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత పదేళ్లలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది.