మరిన్ని రెవెన్యూ సంస్కరణలు…తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు…
రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన ప్రభుత్వం .. తాజాగా వ్యవసాయేతర భూమి నియోగ మార్పిడి అధికారాల..

‘Nala’ Powers Only to Tehsildars : రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన ప్రభుత్వం .. తాజాగా వ్యవసాయేతర భూమి నియోగ మార్పిడి అధికారాల నుంచి ఆర్డీవోలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించాలనే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. సాగు భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేయాలంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే దీనిపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు, ప్రతిపాదిత భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ను ఆర్డీవో ఆదేశిస్తారు. ఆ తర్వాత తహసీల్దార్ సిఫారసుకు అనుగుణంగా ఆర్డీవో నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల ‘నాలా’జారీ ఆలస్యం కావడమేగాకుండా.. అక్రమాలు కూడా జరుగుతున్నాయని గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలాంటి రెవెన్యూ లొసుగులకు చెక్ పెట్టాలని తెలంగాణ సర్కారు ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. భూ వినియోగ మార్పిడిపై దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపే సాగు భూమి విస్తీర్ణం నుంచి ఇతర అవసరాలకు మళ్లుతున్న భూమిని తొలగించేలా అధికారాలను ఇవ్వాలని నిర్ణయించింది.
