తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు చెప్పినట్టుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ సర్పంచులకు, ఉప సర్పంచులకు కొత్త అధికారాలు దిశగా అడుగులు ముందుకు వేశారు. గ్రామ పంచాయతీల చెక్ పవర్కు సంబంధించి నేడు కొత్త నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018లో మరికొన్ని సెక్షన్లను చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. గ్రామ పంచాయతీల్లో అడిటింగ్ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 17, 2019 నుంచి కొత్త సెక్షన్లు అమలులోకి రానున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా చెక్ పవర్ ఇవ్వకపోవడంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నిధులు విడుదలైనా వాటిని వాడలేకపోతున్నామని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్..ఉపసర్పంచ్లకు జాయింట్ కూడా చెక్ పవర్ అధికారం ఉంటుందని గతంలోనే సంకేతాలు వెలువడ్డాయి .అయితే కొన్ని రోజులుగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు స్థబ్దుగా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో నోటిఫికేషన్ జారీ అయ్యింది.