సిద్ధిపేట .. కేసీఆర్ వర సిద్ధిపేటగా మారబోతోంది. ఒకటి కాదు రెండు కాదు.. సిద్ధిపేటను అభివృద్ధి బాటలో నడిపేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అన్నిటికంటే ప్రతిష్టాత్మకంగా రూ.163కోట్లతో నిర్మించిన 2వేల 460 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత పట్టణ శివారులో రూ.45కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్కి శంకుస్థాపన, రూ.135కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్, రూ.225 కోట్లతో రూపుదిద్దుకోబోతు్న వెయ్యి పడకల ఆస్పత్రికి ఇవాళ కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అలాగే, రూ. 278కోట్లతో అభివృద్ధి చేసిన సిద్ధిపేట చింతల్ చెరువును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇక, రంగనాయక సాగర్ దగ్గర రూ.8కోట్లతో నిర్మించిన గెస్ట్హౌస్, మిట్టపల్లిలో రైతు వేదిక కూడా ప్రారంభిస్తారు. వీటితో పాటు సిద్ధిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా అధినేత హోదాలో కేసీఆర్ ప్రారంభిస్తారు.
సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ ముగిసింది. ఈ సభలో సిద్దిపేటపై సీఎం వరాల జల్లు కురిపించారు. ఇదే సమయంలో మంత్రి హరీష్ రావు పనితీరును కొనియాడారు. హరీష్ ఆణిముత్యం అంటూ కితాబిచ్చారు.
సిద్దిపేట జిల్లా కల నెరవేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సిద్దిపేటలో నీటి గోస నివారణకు లోయర్ డ్యామ్ నుండి నీళ్లు తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించిందన్నారు. దానిపేరే మిషన్ భగీరథ అని పేర్కొన్నారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే సిద్దిపేట-ఇల్లంతకుంట నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట దేశానికే రోల్మోడల్గా ఉందన్నారు. అలాగే త్రీటౌన్ పోలీస్ స్టేషన్, బస్తీ దవాఖానా మంజూరు చేశామన్నారు.
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. హరీష్ రావు ఆణిముత్యం లాంటి వ్యక్తి అని కొనియాడారు. ‘తెలంగాణ కోసం ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏర్పడడం.. రాజీనామా చేసి ఢిల్లీకి పోతున్నాను అని చెబితే.. అందరం కలిసి గంట సేపు అక్కడ హాల్లో ఏడ్చాం. నేను ఢిల్లీకి పోయినదానికి.. మీరు నన్ను పంపినదానికి.. మీ అందరి పేరు నిలబెట్టి తెలంగాణను తెచ్చి ప్రజల చేతిలో పెట్టాను. ఒక్క తెలంగాణనే కాదు. సిద్దిపేటకు నా అంత పని చేసే మనిషి కావాలని ఆలోచించి మంచి ఆణిముత్యం లాంటి హరీష్ రావును మీకు అప్పగించాను. హరీష్ కూడా నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. ఇందుకు నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. హరీష్ రావు మంచి హుషారుమీదున్నాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పోతే చాలు అన్నాడు. ఇక్కడికి వచ్చాక ప్రజల ముందు నన్ను నిలబెట్టి సిద్దిపేటకు ఇంకా ఏం కావాలో అన్నీ అడిగేశాడు.’ అంటూ చమత్కరించారు కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన వాక్చాతుర్యంతో సిద్దిపేటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందన్నారు. ఇది మామూలు పేట కాదని, సిద్ధి పొందినటువంటి పేట అని వ్యాఖ్యానించారు. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ సిద్ధిపేట అని అన్నారు. అంతేకాదు.. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని వ్యాఖ్యానించారు. అవసరం రీత్యా కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు చోట్లా గెలిచానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ కోసం ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏర్పడడం.. రాజీనామా చేసి ఢిల్లీకి పోతున్నాను అని చెబితే.. అందరం కలిసి గంట సేపు అక్కడ హాల్లో ఏడ్చాం.’ అని కేసీఆర్ నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
సిద్దిపేటలో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి హరీష్ రావు ప్రశంసలజల్లు కురిపించారు. సిద్దిపేటకు నేడు గోల్డెన్ డే గా అభివర్ణించారు. రూ.1000 కోట్ల పనులకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం నియోజకవర్గం అదృష్టంగా పేర్కొన్నారు. 960 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకున్నామని పేర్కొన్నారు. ఆత్మగౌరవ పొదిరిల్లులాంటి ఇండ్లను ప్రారంభించుకున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఎవరూ అడగలేదని, ఎవరూ దరఖాస్తు చేయలేదని చెప్పుకొచ్చిన హరీష్ రావు.. పేద ప్రజలకు సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు మురికి కూపాలుగా ఉండేవని మంత్రి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఆత్మగౌరవానికి ప్రతిరూపాలన్నారు. ఇళ్లలోకి అడుగు పెడుతుంటే అక్కా చెల్లెళ్ల కళ్ల నుంచి ఆనందబాష్పాలు చూస్తుంటే తన జన్మధన్యమైందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన స్టేజి మీదకు రానున్నారు. కాగా, సభపై కళాకారులు తమ నృత్యప్రదర్శనలతో, జానపదులతో ఉర్రూతలూగిస్తున్నారు.
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రంగనాయకసాగర్ గెస్ట్ హౌజ్ నుండి సీఎం కేసీఆర్ సభ వద్దకు చేరుకోనున్నారు. తొలుత గెస్ట్హౌజ్ను ప్రారంభించిన ఆయన.. అక్కడ కలియ తిరుగుతూ గెస్ట్హౌజ్లోని సదుపాయాలను పరిశీలించారు. ఆ సందర్భంగా అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికాసేపట్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
సిద్దిపేటలోని రంగనాయకసాగర్ గెస్ట్హౌజ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన గెస్ట్హౌజ్ను ఆయన ప్రారంభించారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ మధ్యలో గుట్టపై గెస్ట్ హౌజ్ను నిర్మించారు. ఈ గెస్ట్హౌజ్ను ఇవాళ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం సిద్దిపేటలోని చింతల్ చెరువు దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ తీరును పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి హరీష్ రావు.. సీఎం కేసీఆర్కు తెలియజేశారు.
నర్సాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లను సకల హంగులతో నిర్మించారు. సుమారు రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. ఇందులో తొలివిడతగా 1,341 ఇళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో 144 మంది గృహ ప్రవేశాలు చేశారు. మిగిలినవారు విడుతల వారీగా కొత్త ఇళ్లలోకి వెళ్లనున్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు కరెంట్ మీటర్ నంబర్, వాటర్ కనెక్షన్ మార్పిడి పత్రం, ప్రాపర్టీ టాక్స్, కామన్ అఫిడవిట్, వంట గ్యాస్ సంబంధిత పత్రాలను అందించారు. మిగిలిన 1,119 ఇళ్లను దశలవారీగా అర్హులకు కేటాయించనున్నారు.
సిద్దిపేటజిల్లాలోని నర్సాపూర్లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. గేటెడ్ కమ్యూనిటీకి ధీటుగా డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ సముదాయంలో మొత్తం 2,460 డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్నాయి. ఈ కాలనీకి కేసీఆర్ నగర్గా నామకరణం చేశారు.
సిద్దిపేటలోని కోమటి చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. చెరవు చుట్టూ నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు పనుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్సాన్పల్లిలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్ హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, టీ.హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో కొత్తగా నిర్మించిన రైతు వేదికను సీఎం ప్రారంభించారు. మిట్టపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. రైతు వేదిక వద్ద గ్రామంలోని ప్రజలను కేసీఆర్ పలకరించారు. అదే విధంగా మిట్టపల్లి మహిళ గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పప్పు దినుసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది పత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకుముందు ఐటీ పార్క్ శంకుస్థాపన సందర్బంగా ఐటీ పారిశ్రామికవేత్తలతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నారు. భవిష్యత్లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు.
రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్లను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా సిద్ధిపేట శివారు ప్రాంతంలో దుద్దెడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నూతన ఐటీ టవర్ రూపుదిద్దుకోబోతుంది. దాదాపు రూ.45కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్కు సీఎం శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట చేరుకున్నారు. సిద్దిపేట శివారులోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిద్ధిపేటలోని పేదల కల నెరవేరబోతోందని రాష్ట్ర మంత్రి హరీష్రావు అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టం ఇవాళ కేసీఆర్ చేతుల మీదుగా తీరబోతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్లే కాదు.. పట్టణానికి ఐటీ హబ్ కూడా రావడం సంతోషంగా ఉందన్నారు. ఇవే కాదు.. సిద్ధిపేట ప్రజలకు ఇంకా అనేక పనులు చేసిపెడతానన్నారు హరీష్రావు.