టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇకపోతే గరికపాడి మోహనరావు అనారోగ్యం కారణంగా వారితో పాటు రాలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆయన కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాసేపటి క్రితమే విలీనం కోరుతూ ఈ నలుగురు టీడీపీ ఎంపీలు సంతకాలు చేసిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో షెడ్యూల్ 10ని అనుసరించి విలీనం చేయాల్సిందిగా ఈ లేఖలో పేర్కొన్నారు. దీనితో ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో టీడీపీకి ఇక ఇద్దరు ఎంపీలు మాత్రమే మిగిలారు.
నలుగురు ఎంపీలు.. ఇకపై బీజేపీ సభ్యులు- జేపీ నడ్డా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం నచ్చి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని.. ఇక నుంచి వారందరూ బీజేపీ సభ్యులని నడ్డా స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్ర నిర్మాణం కోసమే చేరుతున్నాం – సుజనా చౌదరి
విభజన చట్టంలోని ప్రతీ అంశాన్ని అమలు చేయాలంటే బీజేపీతో కలిసి పని చేయాల్సి ఉందని సుజనా అన్నారు. రాష్ట్ర, దేశ నిర్మాణం కోసమే తాము బీజేపీలో చేరామని ఆయన స్పష్టం చేశారు.
TDP MPs of Rajya Sabha join BJP in presence of BJP Working President Shri @JPNadda and Shri @TCGEHLOT. pic.twitter.com/DF56jjDeqn
— BJP (@BJP4India) June 20, 2019