Revised The Price of Corona Tests : తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ పరీక్షల ధరలను రెండో సారి సవరించింది. పరీక్షలను పెంచడంతోపాటు వాటికి అయ్యే ధరలో మార్పులు చేసింది. కరోనా ల్యాబ్కు వెళ్లి చేసుకునే కొవిడ్ పరీక్షలు, ఇంటి వద్ద చేసే కరోనా పరీక్షల ధరల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో పరీక్షల ధరను మొదటిసారి సవరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్ల్లో చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.850, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1,200గా నిర్ణయించింది. తాజాగా రెండో సారి సవరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ల్లో చేసే ఆర్టీపీసీఆర్(RTPC) పరీక్ష ధరను రూ.500, ఇంటి వద్ద చేసే కొవిడ్ టెస్టు ధరను రూ.750గా నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నందున మరోసారి కొవిడ్ టెస్టు ధరలను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
అయితే..రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,81,730 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా… వైరస్తో ఇప్పటివరకు 1,515 మంది చనిపోయారు. ఆదివారం కొత్తగా వైరస్ నుంచి మరో 612 మంది బాధితులు కోలుకున్నారు.