ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్కూళ్లు, కాలేజీలపై కీలక ప్రకటన చేశారు.
Schools, Colleges Re-Open In AP: ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్కూళ్లు, కాలేజీలపై కీలక ప్రకటన చేశారు. నవంబర్ 2వ తేదీ నుంచి 9,10 తరగతులతో పాటు ఇంటర్ క్లాసులు మొదలు కానుండగా… నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు జరుగుతాయి. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు ప్రారంభం అవుతాయి. ఇక డిసెంబర్ 14వ తేదీ నుంచి 1-5 తరగతులు ప్రారంభమవుతాయి. మరోవైపు నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు మొదలవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఇక 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని మంత్రి అన్నారు. కరోనా కారణంగా కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసేందుకు సిలబస్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. అటు స్కూళ్లకు 180 రోజుల పని దినాలు ఉంటాయన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ను పాటిస్తూ స్కూళ్లను తెరుస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిసెంబర్ 1 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు…
డిసెంబర్ 1వ తేదీ నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అలాగే నవంబర్ 2 నుంచి బీటెక్, బీఫార్మసీ సీనియర్ విద్యార్థులకు తరగతులు స్టార్ట్ చేస్తామన్నారు. అటు నాన్- ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరం తరగతులు కూడా వచ్చే నెల 2న ప్రారంభమవుతాయని తెలిపారు. 2021 మార్చి చివరి కల్లా తొలి సెమిస్టర్ పూర్తి చేసి.. ఆగష్టు నాటికి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఇక కరోనా నిబంధనల్లో భాగంగా విద్యార్థులు తప్పనిసరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.