
రంగారెడ్డి జిల్లా విషాదం చోటు చేసుకుంది. కొత్తూరు మండలం తిమ్మాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్యాంకర్ ను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు తండ్రీకొడుకులు కల్యాణ చక్రవర్తి, సత్యనారాయణలుగా గుర్తించారు. కాగా, తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్టెక్ చేయడం తదితర కారణాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎందరో బలవుతుంటే వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.