భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ వ్లాదివోస్తోక్లో జరుగుతున్న తూర్పు దేశాల ఆర్థిక వేదిక 5వ సదస్సులో ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అయితే అక్కడ మోదీ చేసి ఓ పనితో అంతా ఆశ్చర్య పోవడమే కాక.. ప్రధాని సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు. అంతేకాదు ప్రధాని చేసిన ఆ పనిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన అధికార ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. ప్రధాని తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. సమావేశాల్లో భాగంగా రష్యా ప్రతినిధులు ఓ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రధాని మోదీ కోసం ప్రత్యేక సోఫా ఏర్పాటు చేశారు. అయితే మోదీ దానిలో కూర్చోడానికి అంగీకరించలేదు. అందరితో పాటు తాను అని.. ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. మిగతా వారితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్నారు. దీంతో వెంటనే అక్కడి సిబ్బంది.. సోఫా తొలగించి.. కుర్చీని వేశారు. ఆ తర్వాత అందరితో పాటుగా అదే కుర్చిలో కూర్చొని ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
PM @NarendraModi जी की सरलता का उदाहरण आज पुनः देखने को मिला, उन्होंने रूस में अपने लिए की गई विशेष व्यवस्था को हटवा कर अन्य लोगों के साथ सामान्य कुर्सी पर बैठने की इच्छा जाहिर की। pic.twitter.com/6Rn7eHid6N
— Piyush Goyal (@PiyushGoyal) September 5, 2019
కాగా, వ్లాదివోస్తోక్లో జరిగిన ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడిన మోదీ.. తూర్పు దేశాలతో సంబంధాలను బలపరిచేందుకు మాత్రమే ఈ సదస్సు కాదని, మొత్తం మానవాళితో సత్సంబంధాలను ఏర్పరుస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. తూర్పు దేశాలతో భారత్ బంధం ఈనాటిది కాదని గుర్తుచేశారు. వ్లాదివోస్తోక్లో దౌత్య కార్యాలయం ప్రారంభించిన మొదటి దేశం భారత్ అని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు తూర్పు దేశాల్లో ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు.