No Public Gatherings: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్లో ఉండిపోయింది. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ జనాలు గుమిగూడవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు.
కాగా.. ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గి, కేంద్రం మే 3 తర్వాత లాక్డౌన్ను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు యూపీకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరే అవకాశాలు ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.