ప్రాణం మీదకు తెచ్చిన అతి జాగ్రత్త
జాగ్రత్త మంచిదే కానీ, అతి జాగ్రత్తే ఒక్కోసారి కొంప ముంచేస్తుంది.. కరోనా మహమ్మారి మనకు అంటకుండా ఉండేందుకు శానిటైజేషన్ తప్పనిసరి అని చెప్పిన మాటను పాపం యాకుబ్ వేరే రకంగా అర్థం చేసుకున్నాడు..
జాగ్రత్త మంచిదే కానీ, అతి జాగ్రత్తే ఒక్కోసారి కొంప ముంచేస్తుంది.. కరోనా మహమ్మారి మనకు అంటకుండా ఉండేందుకు శానిటైజేషన్ తప్పనిసరి అని చెప్పిన మాటను పాపం యాకుబ్ వేరే రకంగా అర్థం చేసుకున్నాడు.. తనతో పాటు తన కుటుంబసభ్యులందరూ శానిటైజ్ చేసుకుంటే సరిపోదనుకున్నాడు.. తినే చికెన్కు కూడా శానిటైజ్ చేశాడు.. ఇదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.
యాకుబ్ ఉండేది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో.. కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు.. ఆగస్టు మొదటివారంలో చికెన్ కొని తెచ్చాడు.. చికెన్ నుంచి కరోనా అంటుకుంటుందేమోనన్న భయం వెంటాడింది.. చికెన్ వండిన తర్వాత చక్కగా శానిజైటర్ను అందులో కలిపేశాడు.. చికెన్ వాసన చూసిన తర్వాత భార్యా పిల్లలకు ఏదో అనుమానం వచ్చింది.. తినమంటే తినమని చెప్పేశారు.. యాకుబ్ ఒక్కడే చికెన్ అంతా తినేశాడు.. తిన్న కాసేపటికే వాంతులయ్యాయి.. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాడు.. వైద్యులు పరీక్షలన్నీ చేసి పేగులు దెబ్బతిన్నాయన్న చేదు వార్త చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే అంతా సర్దుకుంటుందని అన్నారు.. అయితే ఆసుపత్రిలో ఉంటే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం కొద్దీ వైద్యులకు, సిబ్బందికి చెప్పకుండా ఇంటికొచ్చేశాడు.. ఇప్పుడు రోగం కాస్త ముదిరింది.. కాళ్లూచేతులు పని చేయడం మానేశాయి.. పరిస్థితి విషమించడంతో స్థానిక జడ్పీటీసీ తనకు చేతనైనంత సాయం చేశాడు.. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.. వైద్యసాయం అందిస్తామని ఈటల హామీ ఇవ్వడంతో యాకుబ్తో పాటు కుటుంబసభ్యులు కాస్త ఊరట చెందారు..