పేరుకు పెద్ద హాస్పిటల్.. కానీ అక్కడ సాటి మనిషిని మనిషిగా చూడలేని దౌర్భాగ్యం. పైగా అతడు రోగి అయితే పురుగు కంటే హీనంగా చూడటం అలవాటైపోయింది. సర్కారీ దవాఖానాల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. తాజగా మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో మంచిపేరున్న సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన ఓ సంఘటన వార్తలకెక్కింది. ఎముకలు విరిగిన ఓ పేషంట్ను దుప్పటిపై లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఎముకలు విరిగిన వ్యక్తికి ఎక్స్ రే తీయించుకోవాలని డాక్టర్లు చెప్పడంతో.. హాస్పిటల్ వార్డునుంచి ఎక్స్ రే తీసే గది వరకు సిబ్బంది దుప్పట్లో పడుకోబెట్టి లాక్కెళ్ళారు.
జబల్పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలు ఎలా ఉన్నాయనే దానికి ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పేరుకే పెద్ద హాస్పిటల్ అయినా సరిపడా స్ట్రెచ్చర్లు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే దీనికి కారణమైన సిబ్బంది ముగ్గుర్ని ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు హాస్పిటల్ అధికారులు తెలిపారు.