
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు భారీ డిమాండ్ పెరిగింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని అఖండ మెజార్టీతో గెలిపించిన ఆయన.. ఆ తర్వాత బీహార్లో జేడీయూను గెలిపించడంలో కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఐడియాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సేవలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం వినియోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి సినీ నటుడు కమల్ హాసన్ చేరినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ఆళ్వార్ పేట’లోని పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారని సమాచారం. అన్నాడీఎంకే పార్టీ కన్నా ముందు కమల్ హాసన్ భేటీ కావడంతో.. ఇప్పుడు ఇది తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో కమల్ హాసన్ రాబోయే స్థానిక ఎన్నికల నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్తో చర్చ జరిపినట్లు తెలుస్తోంది.
దేశంలో ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉన్న ప్రశాంత్ కిషోర్.. మోదీ, జగన్ల మాదిరిగానే కమల్ హాసన్ను అధికార పీఠం ఎక్కిస్తాడో లేదో వేచి చూడాలి.