యూపీలోని గౌతమబుద్ద నగర్ జిల్లా దాద్రిలో దారుణం జరిగింది. చదువుల్లో అద్బుతంగా రాణిస్తూ పేరు తెచ్చుకున్న ఓ యువతి ఈవ్ టీజింగ్ కారణంగా చనిపోయింది. అయితే పోలీసులు మాత్రం ఆమె రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందినట్లు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే… యూపీలోని బులంద్షహర్ జిల్లాకు చెందిన సుదీక్షా భాటికి చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ ఉండేది. 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 రిజల్ట్స్లో 98 శాతం మార్కులుతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో యూఎస్లోని మసాచుసెట్స్లో గల బాబ్సన్ కళాశాలలో స్కాలర్షిప్కు అర్హత సాధించింది ఆమె.
అప్పటినుంచి అమెరికాలోనే ఉన్నత చదువులు చదువుతోన్న ఆమె… ఇటీవల కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇండియాకు తిరిగి వచ్చింది. పరిస్థితులు చక్కబడితే ఆగష్టులో తిరిగి అమెరికా వెళ్లాలని భావించింది. అక్కడి కాలేజీలో కొన్ని పత్రాలు ఇవ్వాల్సి ఉండగా… వాటి కోసం సోమవారం చదువుకున్న పాఠశాలకు బయలుదేరింది. తన అంకుల్తో కలిసి బైక్పై వెళ్లగా… దారిలో ఇద్దరు ఆకతాయిలు వారిని ఆటపట్టించారు. బుల్లెట్ వాహనంతో స్టంట్స్ చేస్తూ… జర్క్లు ఇస్తూ వారి బైక్ పైకి దూసుకెళ్తూ హడావిడి చేశారు. ఇదే క్రమంలో ఆ ఆకతాయిలు తమ బైక్తో సుదీక్ష ఉన్న బైక్ను ఢీకొట్టారు. దీంతో ఆమె కిందపడిపోగా తలకు బలమైన గాయమై స్పాట్లోనే మరణించింది. ఆమె అంకుల్ తలకు కూడా బలమైన గాయమైంది. ఆ ఆకతాయిలు కావాలనే వెంబడించి టీజ్ చేసి తమ కుమార్తెను బలి తీసుకున్నారని సుదీక్ష పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. జస్టిస్ఫర్సుదీక్ష అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో తెగ వైరలవుతుంది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.