ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు.. గంటలోపే రిజల్ట్..!
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అతి తక్కువ ఖర్చుతో కరోనాను ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని ఐఐటీ ఖరగ్పూర్
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అతి తక్కువ ఖర్చుతో కరోనాను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని ఐఐటీ ఖరగ్పూర్ వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు వైరస్ ఉనికి తెలుసుకుని జాగ్రత్త పడొచ్చునని తెలిపారు. ఈ పోర్టబుల్ పరికరంతో ఎంతోమందికి పరీక్షలు చేయొచ్చునని, ప్రతి టెస్టు తర్వాత ఒక పేపర్ కాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు.