తాజా ICC ర్యాకింగ్స్.. టాప్ 4లో ముగ్గురు భారత మొనగాళ్లు!
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో శుభ్మన్ గిల్ ప్రపంచ నంబర్-1 స్థానానికి కేవలం ఒక పాయింట్ దూరంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా టాప్-4లో కొనసాగుతూ భారత ఆధిపత్యాన్ని చాటారు. బౌలింగ్, ఆల్రౌండర్, టీ20 ర్యాంకింగ్స్లోనూ పలువురు ఆటగాళ్లు గణనీయంగా మెరుగుపడ్డారు.

ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, తాజా ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్-1 స్థానానికి మరింత చేరువయ్యాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో నిలకడగా రాణించిన గిల్ ర్యాంకింగ్ పాయింట్లలో మెరుగుపడి, నంబర్ వన్ ప్లేస్కు కేవలం ఒక్క పాయింట్ దూరంలో నిలిచాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇంగ్లండ్పై 188 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఇప్పుడు కేవలం ఒక రేటింగ్ పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచి నంబర్-1 ర్యాంక్ను అందుకునే దూరంలో ఉన్నాడు.
Race for the No.1 spot in the ICC Men’s ODI Batting Ranking heats up as India’s star trio close in 👀https://t.co/EuM54qGbZr
— ICC (@ICC) July 22, 2026
మరోవైపు విరాట్ కోహ్లీ 767 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో ప్రపంచ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండటం విశేషంగా మారింది. భారత్ సిరీస్లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయానికి జో రూట్ కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నాటౌట్గా నిలిచి 249 పరుగులు చేసిన రూట్, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 11 స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 19వ స్థానంలో నిలవగా, యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఇది కదా టీమ్ అంటే.. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం జట్టు ప్రకటించిన మాజీ హెడ్ కోచ్!
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ ఆటగాళ్లు మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్ కూడా వరుసగా 54వ, 62వ స్థానాలకు చేరుకుని ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్పై ఐదు వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీ ఏడు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా తొమ్మిదో స్థానంతో టాప్-10లోకి ప్రవేశించాడు. అల్జారీ జోసెఫ్ 26వ స్థానానికి చేరుకోగా, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ 29వ స్థానానికి చేరుకున్నాడు. భారత స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా 10 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 32వ స్థానంలో నిలిచాడు.
ఇది కూడా చదవండి: బుడ్డోడు మళ్లీ బరిలోకి దిగే టైమ్ వచ్చేసింది..! మ్యాచ్ డేట్, లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి వివరాలు ఇవే..
ఆల్రౌండర్ల జాబితాలో మైఖేల్ బ్రేస్వెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని తన కెరీర్లోనే అత్యుత్తమమైన మూడో ర్యాంక్ను అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ తొమ్మిదో స్థానానికి చేరుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు తంజిద్ హసన్, సైఫ్ హసన్ బ్యాటింగ్లో మెరుగైన స్థానాలు దక్కించుకోగా, బౌలింగ్ విభాగంలో మహేది హసన్, రిషాద్ హుస్సేన్ గణనీయంగా పురోగతి సాధించారు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఏకంగా 37 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్కు చేరడం తాజా అప్డేట్లో విశేషంగా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
