హెలికాఫ్టర్లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు
పర్మిషన్ లేకుండా డ్రోన్లే ఎగరకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతారు. అలాంటిది ఓ హెలీకాప్టర్ నెల్లూరు జిల్లాలో ల్యాండ్ అయ్యింది.
పర్మిషన్ లేకుండా డ్రోన్లే ఎగరకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతారు. అలాంటిది ఓ హెలీకాప్టర్ నెల్లూరు జిల్లాలో ల్యాండ్ అయ్యింది. అది కూడా ఓ పల్లెటూరులో. అసలు వోల్వో బస్సు కూడా ఆ మారుమూల గ్రామంలోకి రాలేని పరిస్థితి. మరి హెలీకాప్టర్ ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరొచ్చారు.. రాజకీయ నాయకులా…? సెలబ్రిటీలా…? ఏం జరగబోతోందో అర్థం కాక స్థానికులే కాదు.. పోలీసులు కూడా హైరానా పడ్డారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ వ్యవహారం వివాదంగా మారింది. అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ హడావుడి నుంచి తేరుకున్నాక చూస్తే…అది ఓ ఎన్ఆర్ఐది అని తేలింది. ఇంతకీ ఆ గ్రామంలోకి హెలీకాప్టర్ ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అని పోలీసులు ఆరా తీశారు. రేవూరు గ్రామంలో జరుగుతున్న తమ బంధువుల వివాహానికి ఎన్ఆర్ఐ కుటుంబం హెలికాప్టర్లో వచ్చినట్టు గుర్తించారు. అయితే – ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. అనుమతి లేనిదే ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టరే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే హెలికాప్టర్ సంస్థ అన్ని అనుమతులు తీసుకున్నాకే తమను హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తీసుకొని వచ్చి వెళ్లిందని సదరు వ్యాపారవేత్త చెప్తున్నాడు. ఈ ఘటనపై ఇంతవరకూ స్కూల్ హెడ్మాస్టర్ వివరణ ఇవ్వలేదు.
Also Read : తెలంగాణ : రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు